వేములవాడలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2020-12-15T06:09:20+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా రాజన్న ఆలయం భక్తులతో నిండిపోయింది.

వేములవాడలో భక్తుల రద్దీ
రాజన్న దర్శనం కోసం బారులుదీరిన భక్తులు

 -20 వేలకు పైగా భక్తుల రాక 

వేములవాడ, డిసెంబరు 14 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామి క్షేత్రం సోమవారం  భక్తజన సంద్రంగా మారింది. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా రాజన్న ఆలయం భక్తులతో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారి నిత్య కల్యాణం, కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. కల్యాణకట్టలో పెద్ద సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించారు. సుమారు 20 వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌, ఏఈవో హరికిషన్‌ నేతృత్వంలో  ఏర్పాట్లు చేశారు. 


 ఘనంగా మహాలింగార్చన

 రాజరాజేశ్వరస్వామివారికి సోమవారం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో  ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు  స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామివారి కల్యాణమండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పిండితో చేసిన ప్రమిదలను లింగాకారంలో అమర్చి జ్యోతులు వెలిగించారు. 

 

Updated Date - 2020-12-15T06:09:20+05:30 IST