అదే ఉధృతి... 8న 96 మందికి కరోనా.. ఆదివారం కూడా అదే స్థాయిలో..
ABN , First Publish Date - 2020-08-10T17:23:29+05:30 IST
జిల్లాలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పట్టణాలు, పల్లెల్లో రోజురోజుకు కరోనా వ్యాధిబారిన పడ్డవారి సంఖ్య వేగంగా పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
కరీంనగర్ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పట్టణాలు, పల్లెల్లో రోజురోజుకు కరోనా వ్యాధిబారిన పడ్డవారి సంఖ్య వేగంగా పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన బులిటెన్ ప్రకారంగా ఈనెల 8న జిల్లావ్యాప్తంగా 96 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ అయింది. ఆదివారం జిల్లాలో అదేస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైనట్లు స్థానికుల సమాచారం మేరకు తెలుస్తున్నది. కరీంనగర్లో దాదాపు 50 మందికిపైగా, రూరల్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో 25 మంది కరోనావ్యాధిబారిన పడ్డట్లు తెలుస్తున్నది. కరీంనగర్లోని రోజ్ థియేటర్ సమీపంలో ఒకరికి, చైతన్యపురిలోని ఓ అపార్టుమెంట్లో ఒకరికి, జ్యోతినగర్లోని ఓ అపార్టుమెంట్లో ఇద్దరికి, అదే ప్రాంతంలో మరో ఇద్దరికి, తీగలగుట్టపల్లిలో ముగ్గురికి, కట్టరాంపూర్లో ఐదుగురికి, భగత్నగర్లో నలుగురికి, రేకుర్తిలో ఒకరికి, హరిహరనగర్లో ఒకరికి, అశోక్నగర్లో ఆరుగురికి, రాజీవ్చౌక్లో నలుగురికి, గాంధీరోడ్లో ఒకరికి, వాల్మీకినగర్లో ఒకరికి, దుర్గమ్మగడ్డలో ఒకరికి, హుస్సేనిపురాలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. బోయవాడలో నలుగురికి, శర్మనగర్లో నలుగురికి, సుభాష్నగర్లో ఇద్దరికి, ఆదర్శనగర్లో ఒకరికి, మంకమ్మతోటలో ఇద్దరికి కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయింది. మంకమ్మతోటకు చెందిన ఓ యువకుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.