కరోనా టెన్షన్.. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వైరస్ ఉధృతి
ABN , First Publish Date - 2020-08-03T20:04:46+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా ఉధృతి తగ్గకపోవడంతో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. జిల్లాలో మూడు చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా
తాజాగా 17 పాజిటివ్ కేసులు
592కు చేరిన కొవిడ్ బాధితులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా ఉధృతి తగ్గకపోవడంతో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. జిల్లాలో మూడు చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా సకాలంలో ఫలితాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆదివారం జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక ప్రభుత్వ డాక్టర్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 592 మంది కొవిడ్ బారిన పడ్డారు. తొమ్మిది మంది మృతి చెందారు. 427 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 156 మంది డిశ్చార్జి అయ్యారు.
జిల్లాలో ఇప్పటి వరకు తంగళ్లపల్లి మండలంలో 71 మంది, కోనరావుపేటలో 23, ఇల్లంతకుంట 17, గంభీరావుపేట 16, ముస్తాబాద్ 24, ఎల్లారెడ్డిపేట 17, వేములవాడ 85, చందుర్తి ఇద్దరు, బోయినపల్లి మండలంలో ఏడుగురు, సిరిసిల్ల పట్టణంలో 330 మందికి వైరస్ సోకింది. వేములవాడలో నలుగురు, తంగళ్లపల్లిలో ఒకరు, సిరిసిల్లలో ముగ్గురు, గంభీరావుపేటలో ఒకరు మృతిచెందారు. జిల్లాలో ఇప్పటి వరకు 3472 శాంపిళ్లను సేకరించగా అందులో తంగళ్లపల్లి మండలంలో 579 శాంపిళ్లు, కోనరావుపేట 148, ఇల్లంతకుంట 124, గంభీరావుపేట 109, ముస్తాబాద్ 168, ఎల్లారెడ్డిపేట 154, వేములవాడ 455, చందుర్తి 59, బోయినపల్లి 88, సిరిసిల్ల 15,88 శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేశారు. జిల్లాలో కొవిడ్ విస్తరిస్తుండడమే కాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, డాక్టర్లు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, వైద్య సిబ్బందికి కరోనా సోకుతుండడంతో జిల్లాలో భయానక పరిస్థితి ఏర్పడింది.