పల్లెల్లోనూ వేగంగా..పట్టణాల్లో అదే ఉధృతి
ABN , First Publish Date - 2020-08-05T09:50:58+05:30 IST
ఇంతకాలం పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్ పల్లెలకు సైతం వేగంగా విస్తరిస్తున్నది
ఆగస్టు 2నాటికి జిల్లా వ్యాప్తంగా 1,776 కేసులు
123 పంచాయతీల్లో వైరస్ వ్యాప్తి
పల్లెల్లో 460, మున్సిపాలిటీల్లో 502,
కార్పొరేషన్లో 814 మందికి కరోనా పాజిటివ్
40కి చేరిన మృతుల సంఖ్య
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఇంతకాలం పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్ పల్లెలకు సైతం వేగంగా విస్తరిస్తున్నది. వారం రోజులుగా పల్లెల్లో వ్యాప్తి పెరుగుతూ వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 2వ తేదీ వరకు 1,776 మంది వ్యాధి బారిన పడగా 40 మంది మరణించారు. జిల్లాలోని 313 గ్రామపం చాయతీలకు 123 గ్రామాలకు కరోనా వ్యాధి వ్యాపించింది. ఈ పంచాయతీల్లో 460 మంది వ్యాధిబారిన పడగా తొమ్మిది మంది బలైపోయారు. జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలలో కూడా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగు తూ వస్తున్నది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు 502 మందికి వైరస్ సోకగా అందులో ఐదుగురు మృతిచెందారు. జిల్లాలో కరోనా వ్యాధి సోకిన వారిలో 50శాతం మంది కరీంనగర్ పట్టణంలోనే ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఆగస్టు 2వ తేదీ వరకు అధికారిక సమాచారం మేరకు 814 మందికి కరోనా నిర్ధారణ కాగా 26 మంది మృత్యువాతపడ్డారు. ఈ లెక్కలన్నీ జిల్లా ప్రధాన ఆసుపత్రితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెం టర్లు, చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సమాచారం మేరకు వెల్లడైనవి మాత్రమే.
కొందరు అనుమానితులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి సీటీ స్కాన్ చేయించుకొని ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలితే డాక్టర్ల సలహాతో ఇంట్లో ఉంటూ మందులు వాడుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య దాదాపుగా కోవిడ్ వచ్చిన వారితో సమా నంగా ఉంటుందని తెలుస్తున్నది. జిల్లాలో గత నెల 25వ తేదీ వరకు 313 పంచాయతీల్లో కేవలం 83 పంచాయతీల్లో 253 మందికి కరోనా వ్యాధి సోకింది. వారం వ్యవధిలో ఆగస్టు 2వ తేదీ వరకు వ్యాధి మరో 40 పంచాయతీలకు విస్తరించి 123 పంచాయతీల్లో 460 మందికి సోకింది. వారంరోజుల్లో 40 గ్రామాల్లో 207 మంది కొత్తగా వ్యాధిబారినపడ్డారు. మున్సిపా లిటీలలో కూడా వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత నెల 25 వరకు హుజురాబాద్ మున్సిపాలిటీలో 115 మందికి వ్యాధినిర్ధారణ అయి ఇద్దరు మరణించగా ఆగస్టు 2వరకు వ్యాధిసోకిన వారి సంఖ్య 162కు పెరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీలో 153 మంది ఉన్న రోగుల సంఖ్య 294కు పెరుగగా అందులో ముగ్గురు మరణించారు. కొత్తపల్లి మున్సి పాలిటీలో 14 నుంచి 17కు వ్యాధి బారినపడ్డ వారి సంఖ్యపెరిగింది. వారంరోజుల క్రితం చొప్పదండి మున్సిపాలిటీలో 15 మందిరోగులు ఉండగా తాజా కేసులతో కలిసి ఆ సంఖ్య 29 మందికి పెరిగింది.
కార్పొరేషన్లో మరింత వేగంగా
కరీంనగర్ కార్పొరేషన్ పరిధి కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. వారంరోజుల క్రితం వరకు అధికారిక సమాచారం మేరకు 550 మందికి వ్యాధి నిర్ధారణ కాగా 12 మంది మరణించారు. వారం తిరిగే సరికి 814 రోగులు కాగా 26 మంది మరణించారు. ప్రైవేటుగా చికిత్స చేయించుకుంటున్న పాజిటివ్ పేషెంట్లలో అత్యధికులు పట్టణంలోనే ఉంటున్నారు. అలాంటి వారిని కలుపుకుంటే రోగుల సంఖ్య మరో 300 నుంచి 400 వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ పట్టణంలోని ఏ కాలనీకి వెళ్లినా ఒకరో, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువగానే కోవిడ్ పేషెంట్లు ఉన్నారు.
3న 101 మందికి కరోనా :
ఈ నెల 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా 101 మందికి కరోనా వ్యాధి నిర్దారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనితో జిల్లాలో వ్యాధిపీడితుల సంఖ్య 1,877కు పెరిగింది. మంగళవారం కరీంనగర్ పట్టణంలోని సాయినగర్కు చెందిన ఓ మహిళా కరోనా వ్యాధితో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భాగ్యనగర్కు చెందిన మరో వృద్ధుడు శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించారు. ఆయనకు కూడా కరోనా సోకి ఉండవచ్చని అనుమాని స్తున్నారు. పట్టణంలోని వివిధ డివిజన్లలో 48 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు అనధికారిక సమాచారం. అలాగే హుజురాబాద్ మండలంలో 15 మందికి, చొప్పదండి మండలంలో 9 మందికి, ఇల్లందకుంట మండలంలో నలుగురికి, సైదాపూర్ మండలంలో నలుగురికి, మాన కొండూర్ మండలంలో ఆరుగురికి, వీణవంక మండలంలో ఒకరికి వ్యాధి సోకినట్లు సమా చారం. జమ్మికుంట మండలంలో 18 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిసింది. జమ్మి కుంట పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయంలోని ఐదుగురు ఉద్యోగులకు కరోనా వ్యాధి సోక డంతో విద్యుత్ బిల్లుల చెల్లింపులను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏఏవో జ్యోతిర్మయి ప్రకటించారు. ఈ నెల 10 నుంచి తిరిగి బిల్లుల చెల్లింపులను ప్రారంభిస్తామని తెలిపారు.