జిల్లాలో మరో 73 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-08-11T10:33:57+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ తగ్గడం లేదు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్లో ఆదివారం జిల్లావ్యాప్తంగా 73 మందికి కరోనా వ్యాధి సోకినట్లు

జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు మృతి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలో కరోనా వైరస్ తగ్గడం లేదు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్లో ఆదివారం జిల్లావ్యాప్తంగా 73 మందికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. సోమవారం కరోనా బారిన పడి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతిచెందారు. కరీంనగర్ రాంనగర్కు చెందిన 85 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకగా ఆయనను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ ఆయన సోమవారం మృతిచెందగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన 30 ఏళ్ల యువకుడు కరోనా వ్యాధిబారిన పడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం శంకరపట్నం మండలం మొలంగూర్లో ఒకరికి, ఇల్లందకుంట మండలంలో ముగ్గురికి, గంగాధర మండలంలో ముగ్గురికి, రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలో ఒకరికి, చొప్పదండి మండలంలో 20 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీణవంక మండలంలో తొమ్మిదికి, మానకొండూర్లో ఒకరికి, హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో 52 మందికి కోవిడ్ టెస్ట్లు నిర్వహించగా తొమ్మిది మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జమ్మికుంట ప్రభుత్వం ఆసుపత్రిలో 63 మందికి యాంటిజన్ ర్యాపిడ్ టెస్టులు చేయగా ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ధ్రువీకరించారు. కరీంనగర్లోని రేకుర్తి సాలెహ్నగర్లో ఒకరికి, హనుమాన్నగర్లో ఒకరు, లక్ష్మీనగర్లో ముగ్గురు, బొమ్మకల్ బైపాస్రోడ్డులో ఒకరికి, హిందూపురికాలనీలో ముగ్గురు, శర్మనగర్లో ఇద్దరు, ప్రశాంత్నగర్లో ఒకరు, కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో ఆరుగురు, చేగుర్తిలో ముగ్గురు, కొత్తపల్లిలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 60 మందికిపైగా కరోనా వ్యాధిబారినపడ్డట్లు సమాచారం. జిల్లాలో 50కి తగ్గకుండా ప్రతి రోజూ కరోనా కేసులు నమోదు కావడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.