ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలి

ABN , First Publish Date - 2020-03-24T11:24:55+05:30 IST

కరీంనగర్‌లో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నం దున ప్రజలందరూ ఈనెల 31 వరకు ఇండ్లకే పరిమితం కావాలని కలెక్టర్‌ కె శశాంక ప్రజలను కోరారు.

ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలి

 జిల్లా కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కరీంనగర్‌లో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నం దున ప్రజలందరూ ఈనెల 31 వరకు ఇండ్లకే పరిమితం కావాలని కలెక్టర్‌ కె శశాంక ప్రజలను కోరారు. సోమవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ప్రెస్‌భవన్‌ పరిసరాలకు చెందిన కార్పొరేటర్‌, కాలనీవాసులకు కరోన వైరస్‌పై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. కనిపించని శతువు కరోనాను నియంత్రిచేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన తెలిపారు. మార్చి1 తర్వాత విదేశీ ప్రయాణంచేసి వచ్చిన వారిని గుర్తించి వారికి స్టాంపింగ్‌ చేశామని, వారు కూడా ఇండ్లకే పరిమితం కావాలని తెలిపారు. వారిపై కమ్యూనిటీ వాచ్‌ ఉంటుందన్నారు. వైరస్‌ వ్యాప్తిచెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పరిశుభ్రతతో పాటు ప్రతి రెండు గంటలకు ఒకసారి చేతులు శుభ్ర పరుచుకోవాలని సూచించారు.


పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ యువత విచ్చలవిడిగా రోడ్లపై తిరగవద్దని, తాము ఆరోగ్యంగా ఉన్నామని తమకు వైరస్‌ సోకదని భ్రమపడవద్దని సూచించారు. కరోనా వైరస్‌ ఎవరికైనా సోకే ప్రమాదం ఉందని తెలిపారు. యువత ఈనెల 31 వరకు ఇండ్లకే పరిమితం కావాలని తెలిపారు. అనుమానితులు కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, చల్మెడ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులకు వెళ్లిపరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా వైరస్‌ను పారదోలేందుకు ప్రజలు సహకరించి స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

Updated Date - 2020-03-24T11:24:55+05:30 IST