ప్రశాంతంగా నీట్
ABN , First Publish Date - 2020-09-14T10:39:03+05:30 IST
జిల్లాలో నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కరీంనగర్, తిమ్మాపూర్లో పది పరీక్షా
5,409 మందికి 4967 విద్యార్థులు పరీక్షకు హాజరు
తిమ్మాపూర్, సెప్టెంబరు 13: జిల్లాలో నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కరీంనగర్, తిమ్మాపూర్లో పది పరీక్షా కేంద్రలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. 5,409 మంది విద్యార్థులకు గాను 4,967 మంది హాజరు కాగా 442 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు నీట్ సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ టి లలితకుమారి తెలిపారు.
పరీక్ష రాయకుండానే వెనుదిరిగిన విద్యార్థినులు
వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పరీక్ష కేంద్రాని శైలజ, కీర్తన అనే విద్యార్థినులు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. గేటు వద్దకు మద్యాహ్నం 12.15 గంటలకే చేరుకున్నామని, రద్దీ ఎక్కువగా ఉండడంతో పక్కకు వెళ్లి నిలబడి కాసేపయ్యాకా వచ్చామని వారు సిబ్బందికి చెప్పారు. అప్పటికే మద్యాహ్నం 1.30 కావడంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు.
ఇబ్బంది పడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు
చాలా మంది విద్యార్థులు దూరప్రాంతాల నుంచి వారి తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో సొంత వాహనాల్లో పరీక్ష రాసేందుకు వచ్చారు. కొవిడ్ కారణంగా నిర్వహకులు విద్యార్దులతో వచ్చిన పేరెంట్స్ కి సౌకర్యాలు కల్పించక పోవడంతో ఇబ్బందులు పడ్డారు.
నీట్కు హాజరయ్యే విద్యార్ద్థులు ఫొటో, ఐడి కార్డు, మాస్క్, శానిటైజర్, వాటర్ బాటిల్, గ్లౌవ్స్, హాఫ్ స్లీవ్స్ దుస్తులు ధరించాలని నిబంధనలు ఉన్నాయి. చాలా మంది విద్యార్దులు నిబంధనలు పాటించలేదు. కొందరు ఫొటో కూడా తీసుకురాకపోవడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారే పరీక్ష కేంద్రం వద్ద ఫొటోగ్రాఫర్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థినులు బంగారు ఆభరణాలు, జడలకు రబ్బర్ బ్యాండ్లు, క్లిప్లు పెట్టుకొని రావద్దని, అబ్బాయిలు ఫుల్ షర్టులు ధరించవద్దని నిబంధనలు ఉన్నా కొందరు వాటిని పట్టించుకోలేదు. అధికారులు విద్యార్దుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తప్పని పరిస్ధితిలో కొందరిని పరీక్షకు అనమతించారు.
కొవిడ్-19 దృష్ట్యా విద్యార్థుల చేతులను శానిటైజర్తో శుభ్రం చేసి థర్మల్ స్ర్కీనింగ్ చేసిన అ విద్యార్థులను లోనికి అనుమతించారు. ఒక గదిలో 12 మంది విద్యార్థులను కూర్చోపెట్టారు.
కొవిడ్ సమస్యతో వెనుతిరిగిన విద్యార్థిని
శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థినికి కొవిడ్ లక్షణాలు ఉండడంతో పరీక్ష రాయకుండానే వెనుతిరిగింది. కొవిడ్ లక్షణాలు ఉన్న వారు పరీక్షకు హాజరు కావద్దని, వారికి మరోసారి అవకాశం ఇస్తారని సిబ్బంది మైక్లో తెలిపారు. దీంతో అప్పటికే నీరసంగా ఉన్న ఓ విద్యార్థిని అక్కడి నుంచి బయటకు వెళ్లి పోయింది.
భారీగా ట్రాఫిక్ జాం
సాయంత్రం ఐదు గంటలకు పరీక్ష ముగియడంతో తిమ్మాపూర్, కరీంనగర్లో ఏర్పాటు చేసిన పలు కేంద్రాల నుంచి విద్యార్థులు ఒక్కసారిగా బయటకు రావడంతో రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
సింగాపూర్ కిట్స్లో..
హుజూరాబాద్ రూరల్: మండలంలోని సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నీట్ ప్రశాంతంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కందుకూరి శంకర్ తెలిపారు. కళాశాల వద్ద ఏసీపీ శ్రీనివాస్రావు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.