పనిచేసే ఇంట్లోనే వజ్రాభరణాలు, బంగారం చోరీ
ABN , First Publish Date - 2020-11-14T12:38:19+05:30 IST
నమ్మకంగా పనిచేస్తూ అదను చూసి ఆ ఇంట్లోనే చోరీ
- నిందితురాలి అరెస్టు... సొత్తు స్వాధీనం
హైదరాబాద్ /పంజాగుట్ట : నమ్మకంగా పనిచేస్తూ అదను చూసి ఆ ఇంట్లోనే చోరీ చేసిన పనిమనిషిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య తెలిపారు. బేగంపేట్ గ్రీన్ల్యాండ్స్ కుందన్బాగ్ అపార్టుమెంట్ -506 ఫ్లాట్లో కృష్ణసాగర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో రెండేళ్లుగా బేగంపేట్ మాతాజీనగర్కు చెందిన కుమ్మరి శ్వేత (35) పనిచేస్తోంది.
ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో ఆమెకు తెలుసు. కృష్ణసాగర్ బెడ్రూంలోని అల్మారాలో బంగారం, వజ్రాభరణాలు దాచాడు. ఈ నెల 11న అల్మారాను తనిఖీ చేయగా ఒక జత బంగారం, వజ్రాల చెవి రింగులు, రెండు జతల బంగారు గాజులు కనిపించలేదు. ఇంట్లో పని చేస్తున్న శ్వేతపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో అతడి సమీప బంధువు ప్రియరామ్ ఈ నెల 12న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్వేతను అదుపులోకి తీసుకుని విచారించగా బంగారం, వజ్రాభరణాలు చోరీ చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమె నుంచి చోరీకి గురైన పూర్తి సొత్తును స్వాధీనం చేసుకున్నామని డీఐ నాగయ్య తెలిపారు. డీఎస్ఐ విజయభాస్కర్ రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.