కట్టిన పన్నులు ఏమైనట్లు..?.. పురపాలికలో మాయాజాలం
ABN , First Publish Date - 2020-08-14T15:04:37+05:30 IST
ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన రశీదులు చేతుల్లోనే ఉన్నాయి... కానీ మున్సిపల్ ఖాతాలో ఆన్లైన్లో బాకీ ఉన్నట్లు చూపుతున్నాయి. ఇంతకూ మనం కట్టామా లేదా
మణికొండ పురపాలికలో మాయాజాలం
పలకని కమిషనర్
నార్సింగ్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన రశీదులు చేతుల్లోనే ఉన్నాయి... కానీ మున్సిపల్ ఖాతాలో ఆన్లైన్లో బాకీ ఉన్నట్లు చూపుతున్నాయి. ఇంతకూ మనం కట్టామా లేదా కట్టిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మణికొండ పురజనులలో ఇది అతిపెద్ద ప్రశ్న. ఇటీవల అలకాపూర్ కాలనీలో సురేందర్రెడ్డి డబ్బులు కట్టనందున మున్సిపల్ సిబ్బంది టీవీ లాక్కుపోయారు. సురేందర్రెడ్డి డబ్బులు కట్టి టీవీ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అతనికి డిమాండ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో అప్డేట్ కాలేదని మున్సిపల్ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత చాలా మంది చెక్ చేసుకోవడం ప్రారంభించారు. బాకీ ఉన్నట్లు చూపుతుండడంతో కొంత మంది అవాక్కయ్యారు. డబ్బులు కట్టిన రసీదు చేతిలోనే ఉన్నా.. ఆన్లైన్లో అలా చూపడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఈ రకమైన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. కొందరు గ్రీవెన్స్ సెల్లో తమ ఫిర్యాదులను నమోదు చేస్తున్నారు. తాము ఫలానా తేదీలో ట్యాక్సు కట్టామని, ఇంకా అప్డేట్ కాలేదని ఆన్లైన్లో అధికారులను కోరుతున్నారు. ఆ ఫిర్యాదులను నిర్ణీత సమయంలోపు పరిష్కరించడం లేదా తిరస్కరించడం అధికారులు చేయాలి. కానీ ఇక్కడ నెలల తరబడి ఆ ఫిర్యాదులు పెండింగ్లోనే ఉంటున్నాయి.
బిల్ కలెక్టర్లు ఏం చేస్తున్నారు..
డబ్బులు తీసుకుని బిల్లు కలెక్టర్లు రసీదును ఆఫీసులో సమర్పించగానే వెంటనే వాటిని ఆన్లైన్లో అప్డేట్ చేయాలి. ఇక్కడ ఆ పని జరగనట్లు కనిపిస్తోంది. పోనీ ఆ డబ్బులు కనీసం సర్కారు ఖాజానాకు చేరుతున్నాయా లేదా పక్కదారి పడుతున్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మణికొండ మున్సిపల్ కమిషనర్ జయంత్ వివరణ కోసం ‘‘ఆంధ్రజ్యోతి’’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు.