యూకే నుంచి టీఎస్‌కు వచ్చిన మరో ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2020-12-28T03:44:35+05:30 IST

యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. రాష్ట్రంలో యూకే నుంచి...

యూకే నుంచి టీఎస్‌కు వచ్చిన మరో ఇద్దరికి కరోనా

హైదరాబాద్: యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. రాష్ట్రంలో యూకే నుంచి వచ్చిన వారికి సంబంధించిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజా కేసులతో కలిపి 20కి చేరింది. న్యూ కోవిడ్ స్ట్రెయిన్ నేపథ్యంలో కొత్తగా పాజిటివ్‌గా తేలిన ఇద్దరి శాంపిల్స్‌ కూడా తదుపరి పరిశీలనకు పంపినట్లు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.


ఇదిలా ఉంటే.. యూకే నుంచి, యూకే మీదుగా రాష్ట్రానికి వచ్చినవారిలో శనివారం కూడా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ ఇద్దరూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు చెందినవారే. ఈ నెల 9 నుంచి 1,216 మంది రాష్ట్రానికి వచ్చారు. వీరిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం వరకూ యూకే నుంచి తెలంగాణకు చేరుకున్న మొత్తం 18 మందిలో హైదరాబాద్‌ నుంచి నలుగురు, మేడ్చల్‌-మల్కాజిగిరి నుంచి ఆరుగురు, జగిత్యాల జిల్లాకు చెందినవారు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల వారు ఒక్కొక్కరున్నారని వివరించారు. వీరిని వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచామన్నారు. ఈ 18 మంది సన్నిహితంగా ఉన్న మరో 79 మందిని గుర్తించి, క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. అందరి నమూనాలను జన్యు విశ్లేషణకు సీసీఎంబీకి పంపినట్లు  చెప్పారు.



Updated Date - 2020-12-28T03:44:35+05:30 IST