హైదరాబాద్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో..
ABN , First Publish Date - 2020-07-08T17:55:55+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు పనిదినాల్లో ఎంతో రద్దీగా కనిపించే రహదారులు ఇప్పుడు తక్కువ వాహనాలతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థలు నడవక పోవడం, సినిమా థియేటర్స్, బార్లు, ఇతర సమావేశాలు వంటి వాటిని అనుమతి లేకపోగా, అనుమతి ఉన్న వ్యాపారాలు
గ్రేటర్ రోడ్లపై తగ్గిన ట్రాఫిక్ రద్దీ
మొదటి సారిగా నగరంలో
ఐదు చోట్ల బేషుగ్గా గాలి నాణ్యత సూచికలు
పని దినాల్లో ఇలా ఉండడం అరుదు
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు పనిదినాల్లో ఎంతో రద్దీగా కనిపించే రహదారులు ఇప్పుడు తక్కువ వాహనాలతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థలు నడవక పోవడం, సినిమా థియేటర్స్, బార్లు, ఇతర సమావేశాలు వంటి వాటిని అనుమతి లేకపోగా, అనుమతి ఉన్న వ్యాపారాలు సైతం సరిగా నడపడం లేదు. దీంతో ఇళ్లు వదిలి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. రోజు రోజుకు గ్రేటర్ హైదరాబాద్ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులే ఇందుకు ప్రధాన కారణం. ప్రజలు స్వచ్చంధంగానే తమకు తాము నిర్భందం పాటిస్తున్నారు.వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వారు, అత్యవసర పనులు ఉన్న వారే బయటకు వస్తున్నారు. ఇప్పటికే ప్రజా రవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్ల మీదకు రావడం లేదు. దీంతో రోడ్ల మీద ప్రైవేట్ వాహనాలే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇక ఐటీ కంపెనీ ఉద్యోగులతో పాటు పలు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రమ్ హోం నిర్వహిస్తుండడంతో వాహనాల రద్దీ క్రమంగా తగ్గిపోతోంది.
విద్యా సంస్థల హడావుడి శూన్యం....
గ్రేటర్ హైదరాబాద్ నూతన విద్యా సంవత్సరం అంటే జూన్ రెండో వారం నుంచి మొదలవుతుంది. అప్పటి నుంచి నెల రోజుల పాటు విద్యా సంస్థలకు చెందిన బస్సులు, ఆటో రిక్షాలు, వ్యాన్లు ఇలా వాహనాలు ఉదయం, సాయంత్రం వేళల్లో వేలల్లో రోడ్ల మీదకు వస్తుంటాయి. క రోనా కారణంగా విద్యా సంస్థలు తెరుచుకోలేదు. దీంతో అవన్నీ ఎక్కడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ఇక ఉదయం, సాయంత్ర వేళల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే హడావుడి ఇంతకు ముందులా లేదు. ఈ కారణంగానే రోడ్ల మీద వాహనాల హడావుడి గణనీయంగా తగ్గిందని జూబ్లీహిల్స్, పంజాగుట్టలకు చెంది ట్రాఫిక్ పోలీపసులు తెలిపారు.
ఐదు చోట్ల స్వచ్చమైన గాలి నాణ్యత...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 7 చోట్ల వాయు కాలుష్య తీవ్రతను కొలిచేందుకు యంత్రాలను ఏర్పాటు చేసిన ఆన్లైన్ ద్వారానే మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒకేసారి ఐదు చోట్ల స్వచ్చమైన గాలి నాణ్యత నమోదు కావడం చాలా అరుదుగా పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పుడో ఒక రోజు తప్పితే ఏడాది పొడవునా గ్రేటర్లో వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలోనే ఉండేది. కరోనా భయం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అత్యవసరం అయితేనే తప్ప వాహనాలతో బయటకు వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు. దీంతో ప్రధాన ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రత చాలా తక్కువగా నమోదైంది. మంగళవారం నగరంలోని సనత్నగర్లో 41, బేగంపేట యూఎస్ కాన్సులేట్ వద్ద 34, ఐడీఎ పాశమైలారంలో 33, ఐడీఎ బొల్లారంలో 32, ఇక్రిశాట్ పటాన్చెరు వద్ద 47 మైక్రోగ్రామ్స్ ఇన్ క్యూబిక్ మీటర్లుగా నమోంది. కేవలం హెచ్సీయూ వద్ద 65, జూపార్కు వద్ద 54 మైక్రో గ్రామ్స్ ఇన్ క్యూబిక్ మీటర్లుగా నమోదైంది. 50 మైక్రో గ్రామ్స్ ఇన్ క్యూబిక్ మీటర్ కంటే తక్కువ గా ఉండే గాలి నాణ్యత బాగుందని పర్యావరణ శాస్త్ర వేత్తలు చెబుతుంటారు.
మంగళవారం నగరంలో 4 గంటల సమయంలో నమోదైన గాలి నాణ్యత తీవ్రతలు( మైక్రో గ్రామ్స్ ఇన్ క్యూబిక్ మీటర్లు)
సనత్నగర్ 41
బేగంపేట యూఎస్ కాన్సులేట్ 34
ఐడీఏ బొల్లారం 32
ఇక్రిశాట్ పటాన్చెరు 47
ఐడీఎ పాశమైలారం 33
జూపార్కు 54
హెచ్సీయూ 65