గచ్చిబౌలిలో టిమ్స్‌

ABN , First Publish Date - 2020-04-21T10:36:41+05:30 IST

హైదరాబాద్‌ మహానగరం నలు మూలలా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవల కోసం

గచ్చిబౌలిలో టిమ్స్‌

నగరానికి పశ్చిమాన పెద్దాసుపత్రి

ఉస్మానియా, గాంధీ తరహాలో ఏర్పాటు

సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగరం నలు మూలలా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవల కోసం నగరానికి రావాలంటే ఉస్మానియా లేదంటే గాంధీ, నిమ్స్‌ ఆస్పత్రులకు రావాలి. అత్యవసర సమయంలో నగరం మధ్యలో ఆయా ఆస్పత్రులకు రావాలంటే గంటల తరబడి సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నగర శివార్లలో నలుదిక్కులా నాలుగు ఆస్పత్రులను ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని అత్యవసర సమయంలో వేగంగా అందించేందుకు వీలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017లో ప్రకటించారు.


అప్పటి మాట ఇప్పుడు నిజమవుతోంది. గత ఆదివారం సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గచ్చిబౌలిలో 13 అంతస్తులతో కూడిన భవనంలో 1500 పడకలతో ఏర్పాటు చేసిన ఆస్పత్రిని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(టిమ్స్‌)గా ప్రకటించారు. గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఉన్న ఆస్పత్రికి అదనంగా మరో 9.16 ఎకరాల స్థలాన్ని కేటాయించి భారీ ఆస్పత్రిగా తీర్చిదిద్ది ప్రజలకు వైద్య సేవలందిస్తామని చెప్పడంతో ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యం పెరిగింది. ఇప్పటికే ఐటీ కారిడార్‌తో హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతం అభివృద్ధిలో ఎంతో దూసుకుపోయింది. రియల్‌ ఎస్టేట్‌ పరంగానూ ఆ ప్రాంతం ఆకాశమే హద్దుగా ఉంది. హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా గచ్చిబౌలి చేరుకోవడం ఎంతో సులభం. దీనికి తోడు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతర్జాతీయ కంపెనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు పెరుగుతుండడంతో ఇలాంటి ఆస్పత్రి అవసరం ఉంది.


తాజాగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 1500 మందికి కరోనా వైద్య పరీక్షలు చేసి చికిత్సను అందించేలా గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్సును యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రిగా తీర్చిదిద్దింది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు నగరం మధ్యలో ఉన్నాయి. అక్కడి వరకు రావాలంటే రోగులు ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని ఛేదించాలి. ఈ నేపథ్యంలో.. కొత్త ఆసుపత్రి ఆయా ప్రాంతాల వారి వైద్య అవసరాలను తీర్చగలుగుతుంది. 

Updated Date - 2020-04-21T10:36:41+05:30 IST