మూత్ర విసర్జన కోసం రైలు పట్టాల వద్దకు వెళ్తే.. ప్రాణాలే పోయాయి..!
ABN , First Publish Date - 2020-07-15T13:19:05+05:30 IST
వేర్వేరు ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఫలక్నూమ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి(45) పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు
![మూత్ర విసర్జన కోసం రైలు పట్టాల వద్దకు వెళ్తే.. ప్రాణాలే పోయాయి..!](https://media.andhrajyothy.com/appimg/galleries/202007150747356/07152020074855n55.jpg)
పలు ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని ముగ్గురి మృతి
బర్కత్పుర, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): వేర్వేరు ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఫలక్నూమ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి(45) పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాచిగూడ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మౌలాలిలో..
రైలు ఢీకొని చిరునామా తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 13వ తేదీన మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి(40) పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కడుపు ఎడమవైపు పుట్టుమచ్చ ఉందని, అతడి శరీరంపై నీలం రంగు నలుపు డిజైన్ ఆఫ్ షర్ట్, నీలం రంగు జీన్ ప్యాంట్ ఉన్నాయని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చెప్పారు.
ఖైరతాబాద్లో...
మూత్ర విసర్జన కోసం రైలు పట్టాల వద్దకు వెళ్లిన ఓ వ్యక్తిని రైలింజన్ రైలింజన్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి ఖైరతాబాద్ రైల్వే గేటు వద్ద మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఆ సమయంలో నాంపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలింజన్ అతడిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు 5.6 అడుగుల ఎత్తు, చామనచాయ రంగులో ఉన్నాడని, శరీరంపై తెల్లటి రంగులో ఉన్న ఆకుపచ్చ రంగు చారల చొక్కా, నల్లటి ప్యాంటు ఉన్నాయని, ఛాతిపై పుట్టుమచ్చ ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే నాంపల్లి పోలీ్సస్టేషన్లో సంప్రదించాలని కోరారు.