తలసాని తోటలో కమల వికాసం.. ఊహించని షాకిస్తారా!?

ABN , First Publish Date - 2020-12-06T14:18:30+05:30 IST

నియోజకవర్గ ఓటర్లలో చైతన్యం అధికం.

తలసాని తోటలో కమల వికాసం.. ఊహించని షాకిస్తారా!?

  • మూడు చోట్ల బీజేపీ విజయం
  • పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ

హైదరాబాద్/బేగంపేట : సనత్‌నగర్‌ నియోజకవర్గం అంటేనే నగరంలో ప్రత్యేక గుర్తింపు. నియోజకవర్గ ఓటర్లలో చైతన్యం అధికం. నగరంలో తెలంగాణ గాలి వీచినా అప్పట్లో ఇక్కడి ప్రజలు టీడీపీని ఆదరించారు. 2004, 2009లో కాంగ్రెస్‌ను గెలిపించిన ఓటర్లు, 2014లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశా రు. టీడీపీ నుంచి విజయం సాధించిన తలసాని శ్రీనివా‌స్‌యాదవ్‌ అధికార పార్టీలోకి మారడంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ శకం ప్రారంభమైంది. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో అసెంబ్లీ సీటును కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజ లు కమలానికి జై కొట్టడంతో బీజేపీ ప్రస్థానమూ ప్రారంభమైంది. తాజాగా గ్రేటర్‌ ఎన్నికల్లో అమీర్‌పేట, రాంగోపాల్‌పేట డివిజన్లను కమలం దక్కించుకుంది. ఇదే నియోజకవర్గంలో సగం ఉన్న మోండా డివిజన్‌ లో సైతం బీజేపీ సుమారు 2వేల మెజార్టీతో విజయం సాధించింది.  తలసాని కోటలో కమలం వికసించడంతో అధికారపార్టీలోని అసంతృప్తులు, ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


పని చేయని అభివృద్ధి మంత్రం? 

అధికార పార్టీ నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినా.. సనత్‌నగర్‌లోనే ప్రథమంగా ప్రారంభిస్తోం ది. ఇటీవల మంత్రి కేటీఆర్‌ స్వయంగా ఈ విషయా న్ని వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివా‌స్‌యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నగరంలోనే అత్యధిక బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఈ నియోజకవర్గంలోనే జరుగుతోంది. అమీర్‌పేట్‌, రాంగోపాల్‌పేట, మోండా డివిజన్లలో పెద్ద ఎత్తున వైట్‌ ట్యాపింగ్‌ రోడ్లు, సివరేజీ, వాటర్‌ పైప్‌లైన్‌ నిర్మాణం జరిగింది. రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు దాదాపు చివరి దశకు వచ్చాయి. మోండా డివిజన్‌లో ఆధునిక గ్రంథాలయం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. ఎన్నికలకు ముందే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.  అయినా, ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. 2015లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కేవలం మూడు డివిజన్లలోనే విజయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.




మారుతున్న లెక్కలు.. 

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు బీజేపీ వైపు చూడటం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం అనుకున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ మందుకు వస్తోందని అంటున్నారు. ఒకప్పుడు నియోజకవర్గాన్ని శాసించిన కాంగ్రెస్‌ పార్టీకి కొన్ని డివిజన్లలో 1,500 మించి ఓట్లు పడలేదు. అమీర్‌పేట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 489 ఓట్లు పడ్డాయి. సనత్‌నగర్‌లో 1,400, బేగంపేటలో 1,167, రాంగోపాల్‌పేట్‌లో 1,069, బన్సీలాల్‌పేటలో 1,150, మోండా డివిజన్‌లో 1,087 ఓట్లు వచ్చా యి. అధికార పార్టీలోని సిట్టింగ్‌ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీకి లాభం చేకూర్చిందని అంటున్నారు. బేగంపేటలో సిట్టింగ్‌ కార్పొరేటర్‌ తరుణి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. మిగిలిన చోట్ల సిట్టింగ్‌లను బరిలో దింపారు. బేగంపేటలో టీ ఆర్‌ఎస్‌ విజయం సాధించింది. మంత్రి ముఖ్య అనుచరులుగా ఉన్న శేషుకుమారి, అరుణాగౌడ్‌, ఆకుల రూపలు ఓడిపోవడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో మైనారిటీలు టీఆర్‌ఎస్‌ వైపు, ఉత్తర భారతీయులు, వ్యాపారులు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు.


Updated Date - 2020-12-06T14:18:30+05:30 IST