వరద సాయం తక్షణం అందించాలి: కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-12-07T18:37:57+05:30 IST
వరద బాధితులకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నగరంలోని సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి

హైదరాబాద్: వరద బాధితులకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నగరంలోని సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసన తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ధర్నాకు దిగిన బాధితులు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఒకలా... తర్వాత మరోలా అధికార పార్టీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెంటనే బాధితుల అకౌంట్లలో డబ్బులు వేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పన్యాల జైపాల్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.