వనస్థలిపురంలో దోపిడీ దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2020-06-18T10:02:49+05:30 IST
వనస్థలిపురంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు రెండిళ్లలో చోరీ చేశారు

వరుసగా రెండిళ్లలో చోరీ
రూ. 7.12 లక్షల విలువైన నగలు అపహరణ
వనస్థలిపురం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు రెండిళ్లలో చోరీ చేశారు. ఓ ఇంట్లో రూ. 2.80 లక్షల విలువైన నగలు, రెండువేల రూపాయలు, మరో ఇంట్లో రూ. 4.32లక్షల విలువైన నగలు, నగదు అపహరించారు. వనస్థలిపురం ఆగమయ్యనగర్ జ్యోతినిరంజన్ అపార్ట్మెంట్లో నివసించే సాఫ్ట్వేర్ ఉద్యోగి తూడి మంజిత్రెడ్డి(35) ఈనెల 11న కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన మిర్యాలగూడ మండలంలోని నందిపహాడ్ వెళ్లాడు. బుధవారం ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించిన ఎదురింటివారు అతడికి ఫోన్చేయగా వెంటనే నగరానికి చేరుకున్నాడు. రూ. 2 వేలు, రూ. 2.80 లక్షల విలువైన నగలు చోరీ అయ్యాయని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే కాలనీలో సరస్వతి విజయలక్ష్మి విహార్ అపార్ట్మెంట్లో నివసించే చింతకుంట్ల సుమతి(47) కుటుంబంతో కలిసి స్వగ్రామమైన యాదాద్రిజిల్లా వెళ్లారు. బుధవారం ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడంతో స్థానికులు ఆమెకు సమాచారం ఇచ్చారు. వెంటనే నగరానికి వచ్చి రూ. 4.32లక్షల విలువైన బంగారు నగలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.