ప్రతిరోజూ సంజయ్, అరవింద్, అసద్, అక్బర్ల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్..: రేవంత్
ABN , First Publish Date - 2020-11-26T17:41:31+05:30 IST
హైదరాబాద్: ఎంఐఎం, బీజేపీలపై మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.

హైదరాబాద్: ఎంఐఎం, బీజేపీలపై మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీవీ, ఎన్టీఆర్లాంటి మహా నేతల పేర్లను.. బీజేపీ, ఎంఐఎంలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు. సొంత పార్టీ నేతలు అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్లను.. గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందన్నారు. నిజంగా పీవీ, ఎన్టీఆర్లపై ప్రేమ ఉంటే వారికి భారతరత్న ఇవ్వాలన్నారు. 29న నగరానికి వస్తున్న అమిత్ షా ఆ మహానేతల ఘాట్లను సందర్శించి.. అక్కడే ప్రకటన చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి రోజు సంజయ్, అరవింద్, అసద్, అక్బర్ల మధ్య.. ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తుందని.. దీనికి అమిత్ షా సంధానకర్త అని ఆరోపించారు. రాత్రి పూట అంతా కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారని రేవంత్రెడ్డి విమర్శించారు.