కట్టడి ప్రాంతాల్లో సడలింపు
ABN , First Publish Date - 2020-04-26T10:44:33+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండడంతో కట్టడి ప్రాంతాల్లో బారికేడ్లను తొలగిస్తున్నారు.

సిటీ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండడంతో కట్టడి ప్రాంతాల్లో బారికేడ్లను తొలగిస్తున్నారు. బౌద్ధనగర్, శ్రీనివా్సనగర్, కౌసర్ మసీదు, వారాసిగూడలో కొన్ని రోజుల క్రితం పాజిటివ్ కేసులు నమోదు కాగా అధికారులు కట్టడి ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వారికి నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో బౌద్ధనగర్, శ్రీనివా్సనగర్ ప్రాంతాల్లో కట్టడిని ఎత్తివేసినట్లు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఉపకమిషనర్ రవికుమార్ తెలిపారు.
ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని స్థానికులు సత్కరించారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని రాజీవ్గాంధీనగర్లో రెండు, జానకీనగర్, చంద్రానగర్లో నాలుగు బారికేడ్లను తొలగించారు. శ్రీనివా్స్నగర్లో తొలగించలేదు. ముషీరాబాద్ పరిధి దోమలగూడ, రాంనగర్ డివిజన్ బాకారం కట్టడి ప్రాంతాలను ఎత్తేసినట్లు డీఎంసీ ఉమాప్రకాష్ తెలిపారు. ప్రస్తుతం మరో నాలుగు కట్టడి ప్రాం తాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కూకట్పల్లి సర్కిల్ పరిధి ఓల్డుబోయినపల్లి డివిజన్ పరిధిలోని బడేమసీద్, స్టార్పాయింట్ హోటల్ గల్లీలో కట్టడిని ఎత్తేసినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, డీసీ ప్రశాంతి ప్రకటించారు.