మీడియాతో మాట్లాడుతున్న రామకృష్ణ
ABN , First Publish Date - 2020-09-26T09:49:01+05:30 IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుని సీటు వ్యవహారం మరో మలుపు తిరిగింది
అవిశ్వాస తీర్మానంపై హైకోర్టును ఆశ్రయించిన రామకృష్ణ
నాలుగు వారాల పాటు స్టే ఇచ్చిన న్యాయస్థానం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 25(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుని సీటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణపై సహచర సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టి, పదవీచ్యుతుడ్ని చేసిన రెండు రోజుల్లోనే కీలక పరిణామం సంభవించింది. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించిన రామకృష్ణకు కొంత ఊరట లభించింది. అవిశ్వాస తీర్మానంపై నాలుగు వారాల పాటు స్టే విధించిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల పాటు సమయం ఇచ్చింది.
కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న జె.రామకృష్ణను కొద్ది రోజుల క్రితం తన పదవికి రాజీనామ చేయాలని, ఆయన స్థానంలో 1వ వార్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్రెడ్డిని ఎన్నుకోవాలని ఇటీవల టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ తన పదవికి కాకుండా పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మొత్తం 8 మంది సభ్యుల్లో ఏడుగురు ఒకవైపు ఉండగా, మరోవైపు రామకృష్ణ ఒంటరిగా ఉన్నందున అవిశ్వాస తీర్మానం పెడదామంటూ కొందరు సభ్యులు మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ తదితర నేతలను ఒప్పించారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం పెట్టగా నెగ్గింది. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చెల్లదని, నోటీసు ఇచ్చి 24గంటలు కూడా గడవక ముందే ప్రత్యేక సమావేశం నిర్వహించి, తనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం కంటోన్మెంట్ నిబంధనలకు విరుద్ధమని, తామంతా పదవి పొడిగింపు కాలంలో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో కంటోన్మెంట్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం, నూతన ఉపాధ్యక్షుడి ఎన్నిక చెల్లదంటూ రామకృష్ణ బుధవారం హైకోర్టును ఆశ్రయించగా శుక్రవారం స్టే ఇచ్చింది.
న్యాయం, ధర్మం గెలిచింది
తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చెల్లదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నాలుగు వారాల స్టే ఇచ్చిందని మీడియా సమావేశంలో రామకృష్ణ చెప్పారు. న్యాయం, ధర్మం గెలిచిందని, తాను చేసిన పోరాటంలో విజయం సాధించానని అన్నారు. ప్రజా ప్రతినిధులకు చట్టం గురించి అవగాహన కల్పించవలసిన కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులు పక్షపాతంతో వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రక్షణ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించాలని పోరాటం చేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో కంటోన్మెంట్ వాటా సరిగ్గా అందడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరే దీనికి కారణమని విమర్శించారు. కంటోన్మెంట్ అభివృద్ధికి విడుదల చేసిన నిధులపై మున్సిపల్ శాఖ మంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.