వాకింగ్‌కు వెళ్తే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు

ABN , First Publish Date - 2020-05-18T09:21:47+05:30 IST

ట్యాంక్‌బండ్‌ వద్దకు వాకింగ్‌కు వెళితే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ ఓ యువతి ట్విటర్‌ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది.

వాకింగ్‌కు వెళ్తే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు

ట్విటర్‌ ద్వారా డీజీపీ, సీపీకి యువతి ఫిర్యాదు

చిక్కడపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): ట్యాంక్‌బండ్‌ వద్దకు వాకింగ్‌కు వెళితే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ ఓ యువతి ట్విటర్‌ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది. తన సోదరుడిని డాక్టర్‌ సూచనల మేరకు వాకింగ్‌కు తీసుకొచ్చామని చెప్పినా పోలీసులు వినలేదని, ఆపి వేధించారని యువతి ఆరోపించింది. ఘటనా స్థలానికి వచ్చిన తన తండ్రిని కూడా పోలీసులు దూషించారని, తండ్రిని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి ఆయనపై, సోదరుడిపై కేసు పెట్టారని పేర్కొంది. యువతి ఫిర్యాదుపై స్పందించిన చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ పి. శివశంకర్‌రావు ట్విటర్‌లో వివరణ ఇచ్చారు.


యువతి, ఆమె సోదరుడు మాస్కు సరిగా పెట్టుకోకుండా జాగింగ్‌కు వచ్చారని, ఈ విషయమై అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని ఆపి ప్రశ్నించారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఎస్‌ఐ కోటేష్‌ వారికి చెప్పినా వినకుండా వాగ్వాదం చేశారని అన్నారు. వారిని స్టేషన్‌కు తీసుకెళ్లే సమయంలో ఆమె సోదరుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడని సీఐ వివరించారు. ఆమె తండ్రి తన దుస్తులు చించుకోవడంతో పెట్టీ కేసు పెట్టామని సీఐ అన్నారు. దూర ప్రాంతానికి వాకింగ్‌కు ఇకముందు వెళ్లబోమని వారు ట్విటర్‌లో పేర్కొన్నారని సీఐ తెలిపారు.

Updated Date - 2020-05-18T09:21:47+05:30 IST