ఇద్దరు ఫ్రెండ్స్.. షాపింగ్ వెళ్లి స్పోర్ట్స్ బైక్పై తిరిగొస్తూ.. ఒక్క పొరపాటుతో..
ABN , First Publish Date - 2020-12-28T16:46:26+05:30 IST
మితిమీరిన వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ద్విచక్రవాహనంపై వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు యువకులు వెనుక నుంచి వచ్చి ఎక్స్కవేటర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇద్దరు యువకుల్ని బలిగొన్న అతివేగం
ఎక్స్కవేటర్ వెనుక నుంచి ఢీకొన్న బైక్
ఉప్పల్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మితిమీరిన వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ద్విచక్రవాహనంపై వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు యువకులు వెనుక నుంచి వచ్చి ఎక్స్కవేటర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి సమీపంలోని సూరేపల్లి గ్రామం ఆకుతోటబావి తండాకు చెందిన అమ్రు కుమారుడు లకావత్ నరేష్(22), ఘట్కేసర్ మండలం పోచారానికి చెందిన శ్రీరాములు కుమారుడు టంగుటూరి గణేష్(20) ఇద్దరు స్థానికంగా అన్నోజిగూడలోని ఇండస్ వివా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపె రామంతాపూర్లోని డీమార్ట్ మాల్కు వెళ్లి షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
స్పోర్ట్స్ బైక్పై మితిమీరిన వేగంతో వస్తున్న వారు ఉప్పల్ మోడ్రన్ బేకరి వద్ద ముందు వెళుతున్న ఎక్స్కవేటర్ యూటర్న్ తీసుకుంటున్న విషయాన్ని గమనించలేదు. వెనుక నుంచి అతి వేగంతో దూసుకొచ్చి పొక్లేయినర్ను ఢీకొట్టారు. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం నడుపుతున్న వ్యక్తి నరేష్ హెల్మెట్ ధరించినప్పటికీ అది ఎగిరి పక్కకు పడింది. ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టమార్టం కోసం గాంధీకి తరలించారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.