గాంధీ ఆస్పత్రి సెల్లార్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విందు
ABN , First Publish Date - 2020-05-18T09:14:00+05:30 IST
కొవిడ్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో శనివారం రాత్రి ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మద్యం తాగి అర్ధరాత్రి నుంచి ఆదివారం ..

ఇంటికి వెళ్లగానే గుండెపోటుతో ఒకరి మృతి
అడ్డగుట్ట, మే 17 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో శనివారం రాత్రి ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మద్యం తాగి అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు విందు చేసుకున్నారని తెలిసింది. తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఓ వ్యక్తి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి గుండెపోటుతో చనిపోయాడు. విందు వ్యవహారం ఆస్పత్రి ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణ చేపట్టారు. ఆస్పత్రిలోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి.. సెల్లార్లో గంటలతరబడి విందు చేసుకుంటే ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్పత్రిలో అడుగడుగునా బందోబస్తు ఉన్నప్పటికీ విందు విషయం పోలీసులు తెలుసుకోలేకపోయారు. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
విచారిస్తాం ..జయకృష్ణ, ఆర్ఎంఓ-1
పూర్తి సమాచారం తెలియదు. ఆదివారం కావడంతో కేవలం రెండు గంటలు మాత్రమే ఆస్పత్రిలో ఉన్నాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు చనిపోయాడని సమాచారం వచ్చింది. చనిపోయిన వ్యక్తిని వెళ్లి చూసి వస్తామని ఇతర ఉద్యోగులు కోరడంతో వాహనం ఏర్పాటు చేస్తున్న సమయంలో నాకు విషయం తెలిసింది. సోమవారం పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.