దొంగ అనే అనుమానంతో...
ABN , First Publish Date - 2020-09-16T07:30:49+05:30 IST
బాచుపల్లి పీఎస్ పరిధి ప్రగతినగర్లో నూతనంగా నిర్మిస్తున్న అభి వెంచర్లో పని చేయడానికి మేస్త్రీల బృందం సోమవారం

తలపై కొట్టి తాడుతో బంధించిన వాచ్మన్.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
నిజాంపేట్, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి) : బాచుపల్లి పీఎస్ పరిధి ప్రగతినగర్లో నూతనంగా నిర్మిస్తున్న అభి వెంచర్లో పని చేయడానికి మేస్త్రీల బృందం సోమవారం ఒడిశా నుంచి వచ్చింది. తెలవారుజామున 4 గంటల సమయంలో లక్ష్మణ్ జా (48) అనే మేస్త్రీ అభి వెంచర్కు ఆనుకొని ఉన్న మరో నూతనంగా నిర్మిస్తున్న జ్యోత్స్న అపార్ట్మెంట్లోకి వెళ్లాడు. అలికిడి కావడంతో అదే అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్న నర్సింహ లక్ష్మణ్ను చూసి దొంగ వచ్చాడని భావించాడు. కర్రతో లక్ష్మణ్ తలపై కొట్టి తాడుతో బంధించాడు. వాచ్మన్ చుట్టుపక్కల వారికి సమాచారాన్ని అందించి మరోసారి కొట్టడంతో లక్ష్మణ్ తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయాడు. పరిస్థితి విషమించడంతో చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లక్ష్మణ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నర్సింహను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.