ఆలయాలకు పట్టువస్త్రాల సమర్పణ
ABN , First Publish Date - 2020-07-18T09:53:13+05:30 IST
విజయవాడ కనకదుర్గ దేవాలయ ట్రస్ట్ బోర్డు తరఫున శుక్రవారం పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలకు పట్టువస్ర్తాలు సమర్పించారు.

విజయవాడ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఘన స్వాగతం
మదీన, జూలై 17 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కనకదుర్గ దేవాలయ ట్రస్ట్ బోర్డు తరఫున శుక్రవారం పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలకు పట్టువస్ర్తాలు సమర్పించారు. కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు బండారు జ్యోతి వెంకటరమణ, బండారు సాయిప్రియ, చక్క వెంకట నాగవరలక్ష్మి, వెంకటకృష్ణ ప్రసాద్, సూర్యప్రసాద్ గుప్తా, ఆకారం నర్సింగ్ తదితరులు పాతబస్తీకి చేరుకుని చారిత్రక లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం, ఉప్పుగూడ మహంకాళి ఆలయం, హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం, మీరాలంమండిలోని మహాకాళేశ్వర ఆలయం, ప్రధాన ఆలయాలలో అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేచారు. ఆయా ఆలయ కమిటీల ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు ఆయా ఆలసయాల్లో కుంకుమార్చన పూజలు నిర్వహించి, అమ్మవారికి బోనాలు సమర్పించారు.
పుష్పాంబరిగా సర్వమంగళాదేవి
ఘట్కేసర్ : సర్వమంగళా దేవి అమ్మవారు పుష్పాంభరిగా భక్తులకు దర్శన మిచ్చారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాఖాంభరిగా, ఫలాంభరిగా, మధురాంభరిగా, పుష్పాంభరిగా అలంకరించి పూజిస్తారు. ఇందులో భాగాంగా ఆషాడ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలకంరించి పూజించారు. ఈ నెల 21తో ఆషాఢ మాసం ముగుస్తుందని ఆలయ పూజారి విశాల్ శర్మ తెలిపారు.
ముషీరాబాద్లో..
ముషీరాబాద్: ముషీరాబాద్లోని మహంకాళి అమ్మవారిని శుక్రవారం వివిధ రకాల కూరగాయలతో ముస్తాబు చేశారు. అమ్మవారికి మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబుయాదవ్ అమ్మవారి దేవాలయం సందర్శించారు.
మహంకాళి ఆలయంలో వీహెచ్, కాలేరు పూజలు
నల్లకుంట: అంబర్పేటలో మహంకాళికి భక్తులు బోనాలు సమర్పించారు. అమ్మవారికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్పేట, గోల్నాక డివిజన్ల కార్పొరేటర్లు పులి జగన్, కాలేరు పద్మావెంకటేష్, పూజలు నిర్వహించారు.
ముందుగానే బోనాలు..
బౌద్ధనగర్: కరోనా నేపధ్యంలో ఆది, సోమవా రం జరిగే బోనాలను ఇంటివద్దే నిర్వహించుకోవాలని పోలీసులు, అధికారులు సూచించడంతో శుక్రవారం చిలకలగూడలోని కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయంలో ముందుగానే అమ్మవార్లకు బోనాలను, సాకను సమర్పించారు. సినీనటి గీతాసింగ్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.