ఎన్నారై మహిళపై అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌

ABN , First Publish Date - 2020-02-08T16:31:40+05:30 IST

ఎన్నారై మహిళపై అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌

ఎన్నారై మహిళపై అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌

వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌.. రూ. లక్షలు వసూలు

నిందితుడిసహా భార్య, మేనల్లుడి అరెస్టు

నిజాంపేట్‌(ఆంధ్రజ్యోతి): ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మహిళతో స్నేహం ముసుగులో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడితోపాటు సహకరించిన భార్య, మేనల్లుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన మామిడి సంజీవరెడ్డి(48) నిజాంపేట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. 2018 జూలైలో ఫేస్‌బుక్‌ ద్వారా ఎన్నారై మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. అక్టోబర్‌ 31న ఆమె అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో రిసీవ్‌ చేసుకొని ఆమె చెల్లెలు ఇంటి వద్ద విడిచిపెట్టాడు. రెండు రోజుల అనంతరం ఆమెను భోజనానికి ఆహ్వానించి కూకట్‌పల్లిలోని సితార హోటల్‌కు తీసుకెళ్లాడు. తన భార్య కావేరి (48), మేనల్లుడు విశాల్‌రెడ్డి(22)ని ఆమెకు పరిచయం చేశాడు. తమతో కలిసి భోజనం చేయాలని ఆ మహిళకు చెప్పగా.. వద్దని చెప్పింది. మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ముగ్గురూ కలిసి ఎన్నారై మహిళను నిజాంపేటలోని వారికి ఇంటికి తీసుకెళ్లారు. మత్తులో ఉన్న ఆమెపై సంజీవరెడ్డి అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. అప్పటి నుంచి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఆమె నుంచి 30 తులాల బంగారం, ఆరువేల యూఎస్‌ డాలర్లు, చెక్కు బుక్‌లు, ఏటీఎం కార్డులు, సుమారు రూ. 50 లక్షలు తీసుకున్నాడు. రోజు రోజుకూ అతడి వేధింపులు అధికమవడంతో బాధితురాలు ఈనెల 4వ తేదీన బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంజీవరెడ్డిని అతడికి సహకరించిన భార్య కావేరి, మేనల్లుడు విశాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-02-08T16:31:40+05:30 IST