ఆ నెక్లెస్.. సొంత వారికి చేరింది..
ABN , First Publish Date - 2020-12-27T06:33:45+05:30 IST
ఈ నెల 24న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘ఒక నెక్లెస్.. ముగ్గురు మహిళలు’ కథనం బాధితురాలు తిరిగి తన నెక్లెస్ పొందేలా చేసింది.
‘ఆంధ్రజ్యోతి’ కథనం చూసి పోలీసులను ఆశ్రయించిన మహిళ
ఆధారాలు నిర్ధారించుకుని నెక్లెస్ అందజేత
మదీన, డిసెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 24న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘ఒక నెక్లెస్.. ముగ్గురు మహిళలు’ కథనం బాధితురాలు తిరిగి తన నెక్లెస్ పొందేలా చేసింది. అన్ని ఆధారాలతో పోలీ్సస్టేషన్కు వచ్చిన ఆమెకు శనివారం పోలీసులు నెక్లెస్ అందజేశారు. ఈనెల 20న పార్ధీవాడ చౌరస్తాలో రోడ్డుపై పడి ఉన్న నెక్లె్సను ముగ్గురు మహిళలు చూసి తీసుకున్నారు. దానిని పంచుకునే విషయంలో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. విషయం కాస్తా హుస్సేనిఆలం పోలీసులకు తెలియడంతో వారు ఆ నెక్లె్సను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఈ నెల 24న ‘ఆంధ్రజ్యోతి’లో నెక్లెస్ ఫొటోతో ప్రచురించింది. ఈ కథనాన్ని చూసిన హబీబ్నగర్కు చెందిన రాజేష్ సతీమణి పి. కవిత శనివారం పోలీసులను సంప్రదించారు. నెక్లెస్ తనదేనని కొనుగోలు చేసిన బిల్లు, దానిని ధరించిన ఫొటోలను చూపించారు. దీంతో సదరు నెక్లెస్ ఆమెదేనని నిర్ధారించుకున్న పోలీసులు బాధితురాలికి నెక్లె్సను అందజేశారు.