హాస్టల్స్లో ఉండే వారికి అండ
ABN , First Publish Date - 2020-03-28T08:59:03+05:30 IST
హాస్టళ్లలో వసతి పొందుతున్న వారికి అండగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే...
![హాస్టల్స్లో ఉండే వారికి అండ](https://media.andhrajyothy.com/appimg/galleries/20200328030505/03282020032839n26.jpg)
- కదిలిన ఎమ్మెల్యేలు...
కూకట్పల్లి/హైదర్నగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): హాస్టళ్లలో వసతి పొందుతున్న వారికి అండగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపుడి గాంధీలు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీకాలనీ మూడో రోడ్డులోని శివాలయం వద్ద హాస్టళ్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. హాస్టల్స్ను ఖాళీ చేయించి, వేలాది మందిని సొంత ఊర్లకు పంపించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉంటామని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. హాస్టల్స్ నిర్వాహకుల ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీ ప్రశాంతి, ఏఎంవోహెచ్ డా.సంపత్, నాయకులు సతీ్షఆరోరా, పవన్, హరనాథ్, రంగమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గాంధీ, కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు, కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణతో కలిసి అడ్డగుట్టలోని హాస్టళ్ల యాజమానులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్ల నిర్వాహకులకు నిత్యావసరాల లభ్యత లేకపోతే తనను సంప్రదిస్తే ప్రభుత్వం తరఫున సరుకులు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నార్నే శ్రీనివాసరావు, శాఖమూరి శ్రీనివాసరావు, హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్కుమార్, సెక్రటరీ శేషయ్య, హాస్టల్ నిర్వాహకులు పాల్గొన్నారు.