సికింద్రాబాద్ జోన్లో మేయర్ పర్యటన
ABN , First Publish Date - 2020-05-19T11:02:03+05:30 IST
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు జంక్షన్ అభివృద్ధికి, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై

రెజిమెంటల్బజార్, మే 18(ఆంధ్రజ్యోతి): మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు జంక్షన్ అభివృద్ధికి, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సోమవారం ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీస్, సీఆర్ఎంపీ కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ క్షేత్రపరిశీలన చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు నిత్యం వచ్చిపోయే ప్రయాణికులకు వసతులు, సౌకర్యాల కల్పన, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జంక్షన్ అభివృద్ధి వంటి అంశాలపై వివిధ విభాగాల అధికారులతో చర్చించారు.
ముఖ్యంగా స్టేషన్కు వచ్చే వాహనాలకు ప్రత్యేక లేన్ల ఏర్పాటు, సాధారణ వాహనాలను మళ్లించటం వంటి విషయాలతో పాటు సెంట్రల్ మిడియన్లు, బస్షెల్టర్ల ఆధునికీకరణ, అధునాతన మరుగుదొడ్లు, షీ టాయిలెట్స్ వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. నేతాజీ విగ్రహం చుట్టూ గ్రీనరీ పెంచి, ఫౌంటెయిన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.