మైనర్లతో కలిసి చోరీలు.. యువకుడు సహా ముగ్గురి అరెస్టు
ABN , First Publish Date - 2020-07-14T16:24:49+05:30 IST
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లు సహా ముగ్గురిని హుమయూన్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2 లక్షల విలువగల వస్తువులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మల్లేపల్లి అఫ్జల్సాగర్
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లు సహా ముగ్గురిని హుమయూన్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2 లక్షల విలువగల వస్తువులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మల్లేపల్లి అఫ్జల్సాగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ దస్తగిర్ అలియాస్ దాదు(27) కూలి పనులు చేసేవాడు. చెడు అలవాట్లకు బానిసయ్యాడు. సంపాదన సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నాడు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిన వారి ఇళ్లు, పాన్షాపుల్లో చోరీలు చేశాడు. పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు మైనర్లతో కలిసి చోరీలు చేయడం తిరిగి ప్రారంభించాడు. ఇళ్లతోపాటు మాసబ్ట్యాంక్ పరిసరాల్లో పార్క్ చేసిన ఆటోలు, ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. ఓ ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆటో, రెండు బైక్లు, చోరీలకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దస్తగిర్ గతంలో కూడా పలు చోరీలు చేసినట్లు తెలిపారు.