తల్లిదండ్రుల మరణం.. కరోనా వల్ల పనుల్లేక.. చెల్లి పెళ్లి ఎలా చేయాలన్న బాధతో..
ABN , First Publish Date - 2020-08-18T18:57:32+05:30 IST
ఆర్థిక భారం, కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం
![తల్లిదండ్రుల మరణం.. కరోనా వల్ల పనుల్లేక.. చెల్లి పెళ్లి ఎలా చేయాలన్న బాధతో..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020081801242952/08182020132629n69.jpg)
ఆర్థిక భారంతో ఊరేసుకున్న యువకుడు
మన్సూరాబాద్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఆర్థిక భారం, కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం రెండ్లగూడ గ్రామానికి చెందిన శనిగరపు నరేష్ (22) మన్సూరాబాద్లోని మణికంఠ హోం కేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. పక్కనే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు చాలాకాలం క్రితమే చనిపోయారు. అతడి చెల్లెలిని గ్రామంలోని పెద్దనాన్న ఇంట్లో ఉంచాడు. లాక్డౌన్ తరువాత అతడికి సరిగా పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
చెల్లెలి పెళ్లి ఎలా చేయాలన్న విషయంపై నిత్యం బాధపడేవాడు. సొంత ఊరికి వెళదామని ఆదివారం ఇంటి నుంచి బయలుదేరాడు. కరోనా వల్ల ఇప్పుడు రావొద్దని అతడి పెద్దనాన్న కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో తిరిగి హోం కేర్ సెంటర్కు వచ్చాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు డోర్ కర్టెన్తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోం కేర్ సెంటర్ నిర్వాహకుడు ఆదివారం రాత్రి వచ్చి చూడగా ఉరేసుకున్న నరే్షను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.