గుండె నిండా ప్రేమ!

ABN , First Publish Date - 2020-12-15T06:09:40+05:30 IST

ఇద్దరికీ ఫేస్‌బుక్‌ పరిచయం... ఇష్టంగా, ఆపై ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు.

గుండె నిండా ప్రేమ!
రైలు కింద ఆత్మహత్య చేసుకున్న వంశికృష్ణ

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య

అడ్డగుట్ట, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): ఇద్దరికీ ఫేస్‌బుక్‌ పరిచయం... ఇష్టంగా, ఆపై ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలిపై ఉన్న ప్రేమను తెలియజేయడానికి అతనికి మాటలుసరిపోలేదు. అందుకే ఆమె రూపాన్ని తన గుండెపై పచ్చుబొట్టు వేసుకున్నాడు. సంతోషంగా ఉన్న ప్రేమికుల మధ్య కలతలు వచ్చాయి. కొద్దిరోజులుగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ప్రియురాలి ఎడబాటు భరించలేని వంశీకృష్ణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సోమవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విధారకమైన సంఘటన ఆల్వాల్‌ పరిధిలోని భూదేవినగర్‌ రైల్వేట్రాక్‌పై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...
చిలకలగూడ కు చెందిన వంశికృష్ణ (22) ప్రవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అల్వాల్‌కు చెందిన ఓ యువతి(20)తో  ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆమె సికింద్రాబాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తోంది.  ఇద్దరి అభిరుచులూ, అభిప్రాయాలూ కలిశాయి. పరిచయం.. ప్రేమగా మారి.. ఇద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి తారాస్థాయికి చేరడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వంశికృష్ణ ఆదివారం బాలాజీనగర్‌లో స్నేహితుల ఇంటికి వెళ్లాడు. అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. రోజూలాగే.. సోమవారం డ్యూటీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన వంశికృష.. అల్వాల్‌ భూదేవినగర్‌ సమీపంలోని ట్రాక్‌పైకి వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-12-15T06:09:40+05:30 IST