కఠిన ఆంక్షలు.. కట్టడి యత్నం

ABN , First Publish Date - 2020-03-25T08:55:16+05:30 IST

చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో ప్రజలు సంచరించకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

కఠిన ఆంక్షలు.. కట్టడి యత్నం

ప్రజలు బయటకు రాకూడదని లాక్‌డౌన్‌   

వాహనదారులపై కేసుల నమోదు  

పలు వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు 


చాదర్‌ఘాట్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో ప్రజలు సంచరించకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచీ మలక్‌పేట, చాదర్‌ఘాట్‌ పోలీసులు గస్తీ తిరుగుతూ గుంపుగా ఉన్న వారిని చెదరగొడుతున్నారు. పాలు, కూరగాయలు, చికెన్‌, మటన్‌ షాపు, కిరాణ షాపులు మినహా మిగతా షాపులు ఎవరైనా తెరచినట్టు గుర్తిస్తే పోలీసులు వాటిని మూయించారు. నిత్యావసర సరుకుల బయటికి వెళ్లిన వారు కుటుంబం నుంచి ఒక్కరే బయటికి రావాలని, మళ్లీ తిరిగినట్టుగా గుర్తిస్తే ఆయా వాహనాదారులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు ప్రజలందరు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌, ముసారాంబాగ్‌ చౌరస్తా నుంచి మలక్‌పేట వైపు వెళ్లే వాహనాలను మలక్‌పేట పోలీసులు అడ్డుకున్నారు. మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీసులు 33 మంది వాహనాదారులపై కేసులు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ టి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కొంతమంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు రోడ్లపై సంచరిస్తూ పట్టుబడ్డారన్నారు.


చంపాపేటలో...

చంపాపేట డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చారు. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మందమల్లమ్మ చౌరస్తా నుంచి డీఎంఆర్‌ఎల్‌ ఎక్స్‌రోడ్‌ వైపు వాహనాలు వెళ్లకుండా చంపాపేట ఎక్స్‌రోడ్‌ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు.


కిక్కిరిసిన దుకాణాలు

సైదాబాద్‌: మంగళవారం సైతం ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కిరాణ, కూరగాయల దుకాణాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. మాదన్నపేట కూరగాయల మార్కెట్‌కు భారీగా ప్రజలు రావడంతో రోడ్లు, మార్కెట్‌ రద్దీ ఏర్పడింది. పోలీసులు మార్కెట్‌ను దిగ్బందం చేసి ప్రజలు ఎక్కువగా రాకుండా అడ్డుకున్నారు. సైదాబాద్‌, మాదన్నపేటలో నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. 


జీహెచ్‌ఎంసీ చర్యలు

పూర్ణోదయకాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణగా తేలడంతో జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-6,7 యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. పూర్ణోదయ కాలనీ, వాణినగర్‌, లక్ష్మీనగర్‌, వినయ్‌నగర్‌, పూసలబస్తీ, సైదాబాద్‌ కాలనీలో రసాయనాలు పిచికారి చేశారు. వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. 


సింగరేణి కాలనీలోని బెల్ట్‌షాపులలో మద్యం అమ్మకాలను అరికట్టేందుకు సైదాబాద్‌ పోలీసులు రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. 


పలు షాపులు సందర్శించిన మేయర్‌ పారిజాత

సరూర్‌నగర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకులు విక్రయించే రైతులు, వ్యాపారులతో పాటు వాటిని కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలు సైతం తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి సూచించారు. మంగళవారం ఆమె వనస్థలిపురం ఏసీపీ జయరామ్‌తో కలి సి బడంగ్‌పేట్‌లోని పలు కిరాణా షాపులు, కూరగాయలు విక్రయించే మినీ మా ర్కెట్లు, చికెన్‌, మటన్‌ దుకాణాలను సందర్శించి ఆయా ప్రాంతాల్లోని పరిస్థితిని పరిశీలించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఏసీపీ జయరామ్‌ మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై వాహనాలతో తిరిగితే కఠిన చర్యలతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. పోలీసులకు స హకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ సత్యబాబు, డీఈఈ అశోక్‌రెడ్డి, ఏఈ బిక్కూనాయక్‌, శానిటేశన్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదగిరి, కార్పొరేటర్లు అర్జున్‌, సుదర్శన్‌రెడ్డి, స్వప్నాజంగారెడ్డి, రమాశ్రీనివాస్‌, మమతాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-25T08:55:16+05:30 IST