నివాసం ఉంటుంది ఒకరు.. పట్టా మరొకరికి
ABN , First Publish Date - 2020-12-17T07:09:21+05:30 IST
కొన్నేళ్లుగా ఆ స్థలంలో నివాసం ఉంటుంది ఒకరైతే.. రాజకీయ పలుకుబడితో మరొకరు తన పేరుమీద పట్టా తీసుకున్నాడు.

బంజారాహిల్స్, డిసెంబర్ 16 (ఆంధ్రజ్యోతి):కొన్నేళ్లుగా ఆ స్థలంలో నివాసం ఉంటుంది ఒకరైతే.. రాజకీయ పలుకుబడితో మరొకరు తన పేరుమీద పట్టా తీసుకున్నాడు. న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ డివిజన్లోని పద్మాలయ అంబేడ్కర్నగర్లో 30 గజాల స్థలంలో గుడిసె అప్పలస్వామి కొన్నేళ్లుగా నివసిస్తున్నాడు. అతడి ఇంటి పక్కనే వైభమ్మ అనే మహిళ కుటుంబం ఉంటోంది. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో 58 ప్రకారం ఇక్కడి స్థలంలో ఉంటున్న వారందరికీ పట్టాలు మంజూరు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. వైభమ్మ సమీప బంధువు రాములు టీఆర్ఎస్ నాయకుడు. రాములు రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అప్పలస్వామికి చెందిన గుడిసెపై వైభమ్మకు పట్టా ఇప్పించాడు.అప్పటి నుంచి తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు అప్పలస్వామి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. రాములు నుంచి అతడికి బెదిరింపులు వస్తున్నాయి. ప్రస్తుతం తన గుడిసె శిథిలావస్థకు చేరిందని, తిరిగి నిర్మించుకోవాలంటే రాములు వల్ల ఇబ్బంది ఎదురయ్యే సమస్య ఉందంటూ అప్పలస్వామి షేక్పేట మండల కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరాడు.