విశ్వనగరమంటే విషవాయువులు పీల్చడమా?
ABN , First Publish Date - 2020-11-27T22:13:36+05:30 IST
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, ఉప్పల్, మౌలాలి తదితర ప్రాంతాల్లో కాలుష్యం విలయతాండవం చేస్తోంది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, ఉప్పల్, మౌలాలి తదితర ప్రాంతాల్లో కాలుష్యం విలయతాండవం చేస్తోంది. శివార్లలోని పారిశ్రామికవాడల్లో ఉన్న కర్మాగారాలనుంచి గాలిలోకి హానికర రసాయనాలు వెలువడుతున్నాయి. విషవాయువులతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. అస్తమా, దగ్గుతో పాటు గొంతు, కళ్లు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. కర్మాగారాల నుంచి వచ్చే నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. ఇక్కడి నీటితో చర్మ సంబంధ వ్యాధులు కూడా సోకుతున్నాయి. ఇక్కడి కర్మాగారాల నుంచి వెలువడే కొన్ని ఉద్గారాల వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. అన్ని విషయాలూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తెలిసినా రాజకీయ నేతలకు జంకి చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.
ఓ పక్క జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అయితే పార్టీల నేతలు మాత్రం కాలుష్య నియంత్రణపై ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. ఇంత సీరియస్ అంశమైనా నేతలు కనీసం చర్చించడం లేదు. ప్రచారంలో కనీసం ప్రస్తావించడం లేదు. పెద్ద పెద్ద జీతాలు లేని దిగువ మధ్య తరగతి, పేద వాళ్లు జీవన వ్యయం తక్కువగా ఉంటుందని శివార్లలో నివాసమేర్పరచుకుంటున్నారు. అదే సమయంలో వీరంతా కాలుష్యం కాటుకు గురౌతున్నారు. వీరి మొర ఆలకించే నాయకుడు కానీ, పార్టీ కానీ లేకుండా పోయాయి. జీవన వ్యయం సంగతి దేవుడెరుగు జీవితాలే కరిగిపోతున్నాయి. ఆయుష్షు క్షీణిస్తూ పోతోంది.
ప్రభుత్వాలు కాలుష్యం అంశాన్ని సీరియస్గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని శివారు ప్రజలు కోరుతున్నారు. విషవాయువులు వదిలే కర్మాగారాలను నగరానికి దూరంగా తరలించాలని సూచిస్తున్నారు. కాలుష్య నియంత్రణకు సత్వరమే గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.