ఉపశమనం.. ఆందోళన
ABN , First Publish Date - 2020-04-21T10:51:42+05:30 IST
నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది

నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
చల్లబడిన వాతావరణం
వేడి తగ్గి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయాందోళనలో నగరవాసులు
హైదరాబాద్ సిటీ/ రాజేంద్రనగర్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భగభగమండిన భానుడు సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా చల్లబడ్డాడు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని నగరమంతా చల్లనివాతావరణం నెలకొంది. సాయంత్రం 6 గంటలకు రాజేంద్రనగర్, బుద్వేల్, హైదర్గూడ, కాటేదాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, లాల్దర్వాజ, పాతబస్తీ, కూకట్పల్లి, షేక్పేట, లంగర్హౌజ్, హైటెక్సిటీ, మాసబ్ట్యాంక్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా పాశమైలారంలో 23 మిల్లీమీటర్ల వర్షం పడింది. జగద్గిరిగుట్టలో 5.5, లంగర్హౌజ్లో 4.8, పటాన్చెరు శాంతినగర్లో 4.0 వర్షం కురిసింది. అత్యల్పంగా ఖైరతాబాద్, మాదాపూర్ కాకతీయహిల్స్లో 0.3 మిల్లీమీటర్లు పడింది.
ఇప్పటివరకు మూడు సార్లు..
ప్రతి ఏడాది మార్చి 10 నుంచి వేసవికాలం మొదలయ్యేది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి జనవరి 20 నుంచే నగరంలో ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో 29 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలుండగా, మార్చి 15 నుంచి 34 డిగ్రీలకు పెరిగాయి. ప్రస్తుత ఏప్రిల్ 5 నుంచి రోజూ 36 డిగ్రీలకు తగ్గడం లేదు. ఏప్రిల్ 18, 19 తేదీల్లో 39.4 డిగ్రీలు ఉండగా.. ఆదివారం 38.6, సోమవారం 37.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ 8, 10, 18, 20 తేదీలలో నాలుగుసార్లు నగరంలో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
నగరవాసుల ఆందోళన..
గ్రేటర్లో రెండు, మూడు రోజులకోసారి కురుస్తున్న వర్షాలతో నగరవాసులు ఉపశమనంతో పాటు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం పాజిటివ్ కేసులు హైదరాబాద్కు చెందినవే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి కొంతమేర ఎండ వేడిమి దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వరసగా కురుస్తున్న జల్లులతో వేడితగ్గి వైరస్ వ్యాప్తి అధికమవుతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైర్స బారిన పడకుండా ఉండేందుకు కొందరు ఉదయం పూట ఎండలో నిలబడుతున్నారు.