అక్రమంగా మద్యం అమ్మకం

ABN , First Publish Date - 2020-04-12T09:35:46+05:30 IST

మేడిపల్లిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్రమంగా మద్యం అమ్మకం

మేడిపల్లిలో 38ఫుల్‌బాటిళ్లు స్వాధీనం


బోడుప్పల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): మేడిపల్లిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి పరిధిలోని శ్రీనివాసనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ధరావత్‌ బాలాజీ వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్రమంగా మద్యం అమ్ముతున్నాడు. లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉండటంతో ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిలిపివేసింది. వివిధ బ్రాండ్‌లకు చెందిన మద్యం బాటిళ్లు బాలాజీ విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు దాడిచేసి బాలాజీని అదుపులోకి తీసుకొని విచారించగా అతడి వద్ద పలు రకాల బ్రాండ్‌లకు చెందిన 38ఫుల్‌బాటిళ్లు లభ్యమయ్యాయి. మేడిపల్లి పోలీసులు అతడ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. 


బొల్లారం చెక్‌పోస్టు వద్ద..

తిరుమలగిరి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న రూ.50వేల   విలువైన మద్యం బాటిళ్లను బొల్లారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం బొల్లారం పరిధిలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా తుర్కపల్లి నుంచి ఘట్‌కేసర్‌ వెళ్తున్న కారును ఆపారు. అందులో మద్యం బాటిళ్లు దొరికా యి. దాంతో కారులోని వేణుగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి, సునీల్‌లను అదుపులోకి తీసుకున్నారు. 


బంజారాహిల్స్‌లో..

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నిబంధనలను విస్మరించి మద్యం దుకాణం తెరిచి అమ్మకాలు చేస్తున్న ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు.12 శ్మశాన వాటిక వద్ద ఉజ్వల వైన్స్‌ ఉంది. నిర్వాహకులు మదన్‌మోహన్‌రెడ్డి, గొల్ల రాజు శుక్రవారం అర్ధరాత్రి షాపు తెరిచి మద్యం సీసాలు తరలించేందుకు ప్రయత్నించారు. అంతేగాకుండా షాపు వద్ద అమ్మకాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-04-12T09:35:46+05:30 IST