కోవిడ్ తీవ్రత మరింత తగ్గింది: డీహెచ్ శ్రీనివాస్
ABN , First Publish Date - 2020-11-13T18:42:45+05:30 IST
కోవిడ్ తీవ్రత మరింత తగ్గింది: డీహెచ్ శ్రీనివాస్
హైదరాబాద్: కోవిడ్ తీవ్రత మరింత తగ్గిందని కోటి కమాండ్ సెంటర్ డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు కేసుల తగ్గుదలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. 1200 రాపిడ్, 310 మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ ద్వారా టెస్ట్లు చేస్తున్నట్లు చెప్పారు. తామే ప్రజల దగ్గరకు వెళ్లి టెస్ట్లు మొబైల్ వ్యాన్స్తో చేస్తున్నట్లు వెల్లడించారు. దీపావళితో పాటు చలి కూడా పెరిగిందని... చలి పెరిగితే వైరస్ ప్రభలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, చలి వల్లే వైరస్ కేస్లు పెరగడంతో పాటు, మరణాలు సంభవిస్తున్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు.
దీపావళి సందర్భంగా బాణాసంచాలను బ్యాన్ చేశారని.. అయితే వ్యాపారులకు ఇది ఇబ్బందికర సమస్య కానీ ప్రజల ప్రాణాలు అంతకన్నా ముఖ్యమని స్పష్టం చేశారు. ఏటా దీపావళి తరువాత శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ఫైర్ క్రాకర్స్ లేకుండా ఈ ఏడాది దీపావళి జరుపుకోవాలని కోరారు. పెళ్లిళ్లలోను బాణసంచా కల్చవద్దన్నారు. పండుగల సమయంలో షాపింగ్స్కు ఎక్కువగా వెళ్తున్నారని ఆయా సమయాల్లో తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాట్లాడేప్పుడు మాస్క్ని తీసివేయడం సరికాదన్నారు. మాస్క్ను గడ్డం కిందకి వేసుకోవడం సరికాదని డీహెచ్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏ వాక్సిన్ కూడా ఏడాది కాలంలో అందుబాటులోకి రాలేదని.... చాలా ఏళ్ళ పరిశోధనలు జరగాల్సి ఉంటుందని తెలిపారు. కోవిడ్ కారణంగా వ్యాక్సిన్ను అతి తక్కువ కాలంలో వచ్చేలా చూస్తున్నామన్నారు. ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస్ సూచనలు చేశారు.