పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై అభ్యంతరం
ABN , First Publish Date - 2020-10-04T09:50:22+05:30 IST
పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై అభ్యంతరం
రాజకీయ పార్టీలతో జీహెచ్ఎంసీ సమావేశం
పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ,
ఫొటో ఓటరు జాబితాపై..
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 3 (ఆంధ్రజ్యోతి): పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, అదనపు కేంద్రాల ఏర్పాటు, ఫొటో ఓటరు జాబితా సవరణ- 2021 అంశాలపై జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు శనివారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. సవరణ షెడ్యూల్ను అదనపు కమిషనర్ ఎస్. పంకజ వివరించి పార్టీల నేతల అభిప్రాయా లు తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల హద్దుల గుర్తింపు, ప్రాంతాల మార్పుపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాల్లో లోపాలున్నాయని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాలు గుర్తించాలన్నారు. బీజేపీ నాయకులు పొన్న వెంకటరమణ, పవన్కుమార్లు మాట్లాడుతూ ఓ వర్గానికి సంబంధించిన ప్రాంతాల్లోనే పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇతర ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవా ల్సిన పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఎం, ఇతర నాయకులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ...
జనవరి 1, 2021 ప్రామాణిక తేదీగా ప్రత్యేక సవరణ జరుగుతుందని అదనపు కమిషనర్ పంకజ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 1,586 ప్రాంతాల్లో 3,977 పోలింగ్ కేంద్రాలున్నాయని, 42.37 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. తాజా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, హద్దుల మార్పు, తుది పోలింగ్ కేంద్రాల ఆమోద ప్రక్రియ ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను పరిశీలించి సమగ్ర ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పన పనులను నవంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు పూర్తి చేయాల్సి ఉం టుందని వివరించారు. ఈ క్రమంలో రెండు శని, ఆదివారాల్లో ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించి, నవంబర్ 15న తుది ఓటరు జాబితా ప్రకటించాల్సి ఉంటుందని పంకజ వివరించారు.
1.52 లక్షల దరఖాస్తులు..
ఓటర్ల నమోదుకు జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు 1.52 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పేరు నమోదు, తొలగింపు, చిరునా మా మార్పు, పేరులో సవరణ వంటి అంశాలకు సంబంధించిన దరఖా స్తులు ఎక్కువ ఉన్నాయి. ఆన్లైన్లో 70 వేలకుపైగా, భౌతికంగా 81 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి వీటిలో 1.42 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, 9 వేలకుపైగా పెండింగ్లో ఉన్నాయి. 19 వేలకుపైగా దరఖాస్తులను తిరస్కరించారు.