కాపురానికి తీసుకెళ్లాలని..భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

ABN , First Publish Date - 2020-07-10T09:50:35+05:30 IST

తనను కాపురానికి తీసుకెళ్లాలని ఓ మహిళ భర్త ఇంటి ఎదుట గురువారం బైఠాయించింది.

కాపురానికి తీసుకెళ్లాలని..భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

ఎల్‌బీనగర్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తనను కాపురానికి తీసుకెళ్లాలని ఓ మహిళ భర్త ఇంటి ఎదుట గురువారం బైఠాయించింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ గజ్జెల శేఖర్‌ కుమార్తె మౌనికకు, సరూర్‌నగర్‌ శ్రీసాయికృష్ణనగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఏఈ బూరం దశరథ కుమారుడు, గోవాలో రెస్టారెంట్‌ మేనేజర్‌గా పనిచేసే సంతో్‌షకుమార్‌తో 2017 మే 18న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఏడాదిపాటు వీరి సంసారం గోవాలో సజావుగా సాగింది. మౌనిక గర్భవతి అయిన తర్వాత సంతో్‌షకుమార్‌ ఉద్యోగం మానేసి హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుందామని చెప్పాడు. ఉద్యోగం మానేయడం ఎందుకని ఆమె భర్తను ప్రశ్నించింది. అతడు పట్టించుకోకుండా ఆమెను నాగర్‌కర్నూల్‌లోని తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. మౌనికకు కుమారుడు పుట్టాడు. భార్యాభర్తలకు పెద్దలు సర్దిచెప్పి వేరేచోట కాపురం పెట్టించారు. అయినా సంతో్‌షకుమార్‌లో మార్పు రాలేదు. భార్య, కుమారుడిని అత్తగారింటివద్ద వదిలేశాడు.


భర్త తీసుకెళ్లడానికి రాకపోవడంతో మౌనిక తల్లిదండ్రులతో కలిసి నాగర్‌కర్నూల్‌ పోలీసులను ఆశ్రయించింది. వారు సంతో్‌షకుమార్‌ను పిలిపించి మాట్లాడారు. పరిస్థితి బాగాలేదని తర్వాత వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. నగరానికి వచ్చిన అతడు తల్లిదండ్రులు, తమ్ముడి ప్రోద్బలంతో మౌనిక మతిస్థితిమితం సరిగాలేదని, విడాకులు కావాలని నోటీసులు పంపించాడు. నాగర్‌ కర్నూల్‌ పోలీసులు లాక్‌డౌన్‌ సమయంలో సంతో్‌షకుమార్‌కు మూడుసార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చినా అతడిలో మార్పు రాలేదు. భర్తను కలిసేందుకు మౌనిక కుటుంబ సభ్యులతో కలిసి శ్రీసాయికృష్ణనగర్‌లోని అత్తగారింటికి గురువారం వచ్చింది. ‘సంతోష్‌ మా ఇంట్లో లేడు.. ఎందుకు వచ్చావని’ మౌనికను, ఆమె కుటుంబ సభ్యులను వారు బయటకు గెంటి తలుపులు వేసుకున్నారు. తనను కాపురానికి తీసుకెళ్లాలని మౌనిక సంతో్‌షకుమార్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.  

Updated Date - 2020-07-10T09:50:35+05:30 IST