ఎంత ఇస్తారు..? ఎప్పుడు ఇస్తారు..?.. నేరుగా అభ్యర్థులకే ఫోన్లు..!
ABN , First Publish Date - 2020-11-26T17:34:29+05:30 IST
గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఓటూ విలువైనది కావడంతో అభ్యర్థులు ఏ ఒక్క ఆవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలలో నివాసముంటున్న వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు చేస్తున్నారు. కుటుంబంలో ఎవరెక్కడ ఉంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు

వలస ఓటర్లపై అభ్యర్థుల గురి..
సైదాబాద్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఓటూ విలువైనది కావడంతో అభ్యర్థులు ఏ ఒక్క ఆవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలలో నివాసముంటున్న వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు చేస్తున్నారు. కుటుంబంలో ఎవరెక్కడ ఉంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. వారి కుటుంబసభ్యులు, స్నేహితులతో ఫోన్లు చేయిస్తూ ఓటు వేసేందుకు రావాలని కోరుతున్నారు. వీరి ఓట్ల కోసం ప్రత్యేకంగా కొంత మందికి బాధ్యతలు అప్పగించారు.
ఎంత మంది... ఏం కావాలి...
‘మీ స్నేహితులు ఎంత మంది ఉన్నారు. రాత్రి విందుకు ఏం కావాలి. అవతలి పార్టీవాళ్లు ఏం ఇచ్చినా.., అంతకంటే ఎక్కువ చేస్తా. మీ స్నేహితులందరితో పార్టీ అరేంజ్ చేయి. మందు, మటన్, చికెన్తో విందు ఇద్దాం’ అంటూ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కోరుతున్నారు.
నేరుగా అభ్యర్థులకే ఫోన్లు
కొన్ని చోట్ల ఓటర్లు తమకేం ఇస్తారని నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. ‘మా వద్ద ఇన్ని ఓట్లు ఉన్నాయి... ఎంత ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారు’ అని బేరసారాలు చేస్తున్నారు. కొందరు ఒక్కో ఓటుకు రూ. ఐదు వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారు.