తెలంగాణలో భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల అప్రమత్తం
ABN , First Publish Date - 2020-10-13T15:50:41+05:30 IST
: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఇంజనీర్లను ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభకార్ రావు అప్రమత్తం చేశారు.
![తెలంగాణలో భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల అప్రమత్తం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020101310174223/10132020101850n61.jpg)
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఇంజనీర్లను ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభకార్ రావు అప్రమత్తం చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. 12 వేల మెగా వాట్ల నుండి 4300 మెగావాట్లకు డిమాండ్ పడిపోయింది దీంతో వోల్టేజ్ పెరగడంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. 15 వందల మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతోంది. విద్యుత్ డిమాండ్ పడిపోవడంతో అధికారులను, ఇంజనీర్లను అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్, జెన్కో సీఎండీ ప్రభకార్ రావు అదేశించారు. విద్యుత్ డిమాండ్లో హెచ్చు తగ్గుల నేపథ్యంలో గత రాత్రి నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ లోడ్ను డిస్స్పాచ్ చేయిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభాకర్రావు మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్ తగ్గడంతో థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్డౌన్ చేశామని తెలిపారు. వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయాలని కోరారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, సెల్లార్లకు నీరు వచ్చిన దయచేసి ప్రజలు 1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలపాలని అన్నారు. ఎక్కడైనా వర్షము నీరు సెల్లార్ లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోవాలని... దాని ద్వారా షాట్సర్క్యూట్ కాకుండా ఉంటుందని ప్రభాకర్రావు తెలిపారు.