పసి బాలుడి చికిత్సకు సాయం
ABN , First Publish Date - 2020-12-19T06:04:02+05:30 IST
గుండె, మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాలుగు నెలల పసివాడి ప్రాణాలు కాపాడేందుకు ‘బ్లడ్ డోనార్లైఫ్ సేవర్ ఫౌండేషన్’ ముందుకు వచ్చింది.

విరాళాలు సేకరించి రూ. 50 వేలు అందజేసిన ‘బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్’
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 18 (ఆంధ్రజ్యోతి):గుండె, మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాలుగు నెలల పసివాడి ప్రాణాలు కాపాడేందుకు ‘బ్లడ్ డోనార్లైఫ్ సేవర్ ఫౌండేషన్’ ముందుకు వచ్చింది. ఒకరోజులో రూ. 50 వేల విరాళాలు సేకరించి పసివాడి తల్లిదండ్రులకు అందజేసింది. దేవరకొండ పట్టణానికి చెందిన దంపతులకు పుట్టిన పసివాడు గుండె, మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు వైద్యానికి ఇప్పటికే రూ. 1.50 లక్షలు ఖర్చు చేశారు. కరోనా సమయంలో బాలుడి తండ్రి ఉపాధి కోల్పోయాడు. ఇంత ఖర్చుచేసి చికిత్స చేయించినా బాబు పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. మెరుగైన వైద్యం కోసం కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యానికి రోజుకు రూ. 30 వేల చొప్పున ఖర్చు అవుతోంది. ఆస్పత్రి బిల్లు కట్టలేని తండ్రి సాయం కోసం ‘బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్’ను ఆశ్రయించాడు. వాట్సాప్ ఆధారంగా పనిచేస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులు విరాళాలు సేకరించేందుకు తమ సభ్యులకు సమాచారం అందించారు. కొన్ని గంటల వ్యవధిలోనే రూ. 50 వేలు సేకరించిన సంస్థ వ్యవస్థాపకుడు సునీల్ దూట పసివాడి తల్లిదండ్రులకు ఆ మొత్తాన్ని అందజేశారు.