నేరాలు పెరిగాయి.. వేధింపులు తగ్గాయి..!

ABN , First Publish Date - 2020-12-30T06:27:16+05:30 IST

సైబరాబాద్‌లో గతేడాదితో

నేరాలు పెరిగాయి.. వేధింపులు తగ్గాయి..!

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పెద్దపీట

6.65 శాతం పెరిగిన క్రైమ్‌

135 ఽశాతం పెరిగిన సైబర్‌ క్రైమ్‌

42 శాతం పెరిగిన ఆర్థిక నేరాలు

రౌడీలు, కేడీలపై ఉక్కుపాదం

సైబరాబాద్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదిక విడుదల


‘‘2020లో సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పెద్ద పీట వేశాం. నేరస్థులపై ఉక్కుపాదం మోపాం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నించాం. ప్రతీ కేసు రిజిస్టర్‌ చేసి కేసు నమోదు చేశాం. మీకు అండగా సైబరాబాద్‌ పోలీస్‌ ఉంది అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం’’

- సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ.


హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : సైబరాబాద్‌లో గతేడాదితో పోల్చితే 2020లో సాధారణ క్రైమ్‌ 6.65 శాతం పెరిగిందని, సైబర్‌ క్రైమ్‌ 135 శాతం పెరిగిందని సీపీ సజ్జనార్‌ తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక క్రైమ్‌ నివేదికను విడుదల చేశారు. 2019లో 23,320 కేసులు నమోదు కాగా.. 2020లో 24,868 కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ కేసులు 2019లో 477 ఎఫ్‌ఐఆర్‌లు కాగా.. ఈ ఏడాది 1,119 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ ఏడాది సైబర్‌ నేరగాళ్లు రూ. 23.67 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించారు. 


సీపీ ఇంకా ఏం చెప్పారంటే..


విజిబుల్‌  పోలీసింగ్‌కు ప్రాధాన్యం

‘‘సైబరాబాద్‌లో చార్జి తీసుకున్నప్పటి నుంచి విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రత్యేక స్పాట్లలో, అన్ని సెక్టార్‌లలో సాయంత్రం పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. దాంతో కొట్లాటలు, భౌతికదాడులకు పాల్పడే అల్లరి మూకలను కట్టడి చేయగలిగాం’’ 


సొత్తు రికవరీ తగ్గింది

‘‘గతేడాదితో పోల్చితే దోపిడీలు, దొంగతనాల ద్వారా చోరీకి గురైన సొత్తులో రికవరీ 15 శాతం తగ్గింది. గతేడాది రికవరీ శాతం 75 ఉండగా.. ఈ ఏడాది 60కి పడిపోయింది. 2019లో చోరీకి గురైన సొత్తు రూ. 20,93,52,262లు కాగా.. రికవరీ రూ. 15,67,38,457. (అంటే 75 శాతం). 2020లో చోరీకి గురైన సొత్తు- రూ. 153178771లు కాగా.. రికవరీ రూ. 92302476 (60 శాతం).


మహిళలపై తగ్గిన నేరాలు...

‘‘ఈ ఏడాది షీ టీమ్స్‌ను 6 నుంచి 11 బృందాలు ఏర్పాటు చేశాం. డెకాయిటీ ఆపరేషన్స్‌, అవగాహన కార్యక్రమాలతో ఆకతాయిలు, పోకిరీల భరతం పట్టాం. ఫలితంగా మహిళలపై నేరాలు తగ్గాయి. చిన్నారుల రక్షణకు ఆపరేషన్‌ స్మైల్‌తో పాటు.. బాలమిత్ర, ఉమెన్‌ చైల్డ్‌ సేఫ్టీవింగ్‌, ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌, డయల్‌-100 డొమెస్టిక్‌ వాయిలెన్స్‌ ఇమిడెయట్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేశాం’’ 



Updated Date - 2020-12-30T06:27:16+05:30 IST