భూమి పత్రాల ఆధారంగా వేలిముద్రల ఫోర్జరీ
ABN , First Publish Date - 2020-12-30T06:25:53+05:30 IST
వెబ్సైట్ నుంచి భూములకు సంబంధించిన పత్రాలను తీసుకుని, వాటి ఆధారంగా ఆధార్, వేలిముద్రలు సేకరించి, ఒకరి అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేసిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

ఒకరి ఖాతా నుంచి రూ. 10 వేలు విత్డ్రా
ఇద్దరు విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్ సిటీ/అమీర్పేట్, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): వెబ్సైట్ నుంచి భూములకు సంబంధించిన పత్రాలను తీసుకుని, వాటి ఆధారంగా ఆధార్, వేలిముద్రలు సేకరించి, ఒకరి అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేసిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మధురానగర్ నివాసి సిద్దిరెడ్డి వీర వెంకట సత్యనారాయణమూర్తికి పశ్చిమగోదావరి జిల్లా, ఆనపర్తి ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది. సదరు ఖాతా నుంచి రూ. 10 వేలు విత్డ్రా అయినట్లు ఈనెల 22న సమాచారం వచ్చింది. బ్యాంకు ప్రతినిధులను సంప్రదించగా.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్సార్నగర్ పోలీసులకు ఫర్యాదు చేయగా, సాంకేతికతను వినియోగించి, నగదు విత్డ్రా అయిన పే పాయింట్ కేంద్రం ఐపీ అడ్రస్ ఆధారంగా సీఏ విద్యార్థులైన విశాల్, అర్షద్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఆస్తులకు సంబంధించిన వెబ్సైట్ ఆధారంగా వివరాలు సేకరించి సత్యనారాయణ మూర్తి ఖాతాను యాక్టివేట్ చేసి రూ. 10వేలు డ్రా చేసినట్లు అంగీకరించారు.