రాజ్భవన్ ముట్టడికి సీపీఐ యత్నం
ABN , First Publish Date - 2020-06-21T09:47:05+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, నూతన విద్యుత్ సవరణ బిల్లు-2020ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ హైదరాబాద్
బేగంపేట, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, నూతన విద్యుత్ సవరణ బిల్లు-2020ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ హైదరాబాద్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు చలో రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, నాయకుడు వి.ఎ్స.బోస్ తదితరులు ముఖ్దుంభవన్ నుంచి రాజ్భవన్కు శనివారం ఉదయం బయలుదేరారు.
చాడా వెంకటరెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నారాయణ పోలీసుల కంట పడకుండా కొంతదూరం కారులో, మరికొంతదూరం ద్విచక్రవాహనంపైన రాజ్భవన్ చేరుకున్నారు. రాజ్భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు నారాయణను అరెస్టు చేశారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, రాష్ర్టాలపై పెత్తనం కోసం ప్రధాని ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. కొత్త విద్యుత్చట్టం రాష్ర్టాల హక్కులను హరించేలా ఉందన్నారు.