మండిపోతున్న చికెన్ రేట్లు.. కిలో ఎంతంటే..!
ABN , First Publish Date - 2020-05-11T14:54:26+05:30 IST
నగరంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్
![మండిపోతున్న చికెన్ రేట్లు.. కిలో ఎంతంటే..!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051109220196/05112020092324n21.jpg)
- కిలో స్కిన్ లెస్ రూ.220
- వారంలో రూ.80 పెంపు
హైదరాబాద్ : నగరంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.50కి అమ్మిన దుకాణదారులు.. ప్రస్తుతం రేట్లు పెంచి ‘‘ధరా’’ఘాతానికి పాల్పడుతున్నారు. ఎంఆర్పీ ప్రకారం చికెన్ విక్రయించాల్సి ఉండ గా, కొంతమంది వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచేసి అమ్ముతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబా ద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో జీహెచ్ఎంసీకి చెందినవే అధికంగా ఉన్నాయి. కరోనా వైరస్ బారి నుంచి బయట పడాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, ఈ మేరకు తగిన పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో చాలా మంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కొండెక్కిన కోడి రేట్లు..
కరోనా భయంతో నెల రోజుల క్రితం మెహిదీపట్నం, లంగర్హౌస్, గోల్కొండ, సన్సిటీ, అంబర్పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో కిలో స్కిన్లె్స చికెన్ను రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయించారు. స్కిన్తో కలిపి కిలో చికెన్ను రూ.30కి ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్ల నిర్వహణ భారంతో వినియోగదారులకు ఉచితంగానే ఇచ్చారు. ఒక్కో గుడ్డు ధర రూ.3లే పలికింది. అయితే.. చికెన్, గుడ్డు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ధరలు పెరిగాయి.
15 రోజుల్లో రూ.100
నగరంలోని పలు ప్రాంతాల్లో 15 రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.120 ఉండగా, ప్రస్తుతం రూ.80 అదనంగా పెరిగింది. దీంతో చాలా ఏరియాల్లో కిలోకు రూ.200 రూ. 220 తీసుకుని అమ్ముతున్నారు. దీంతో చికెన్ ధర వింటేనే వణికిపోతున్నారు.
వినియోగదారుల ఆందోళన
నగరంలో అమాంతం పెంచిన చికెన్ ధరలతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. కరో నా నుంచి ఉపశమనం పొందేందు కు చికెన్ తింటే బాగుంటుందని భావిస్తే.. వ్యాపారులు.. వైరస్ ను అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని అధిక రేట్లను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.