గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తాం : కేంద్ర మంత్రి
ABN , First Publish Date - 2020-10-04T16:53:30+05:30 IST
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆదివారం నాడు బర్కత్ పుర-అంబర్ పేటలో కిషన్ రెడ్డి పర్యటించారు. ఇవాళ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గౌతమ్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హాజరైన లక్ష్మణ్, చింతల తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మజ్లిస్ పెత్తనం సాగనివ్వం..
‘కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను.. ఓవైసీ కుటుంబం నుంచి హైద్రాబాద్ను విముక్తి చేస్తాం. తెలంగాణలో మరో పార్టీ ఉండకూడదనే విధంగా టీఆర్ఎస్ వ్యవహారిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదు. హైదరాబాద్లో ఇకపై మజ్లీస్ పార్టీ పెత్తనం సాగనివ్వం’ అని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి మాట్లాడుతున్నంత సేపు బీజేపీ కార్యకర్తలు, నేతలు ఈలలు.. కేకలతో హోరెత్తించారు.