అక్రమంగా బాలుడి దత్తత..తీసుకున్న వారిపై కేసు
ABN , First Publish Date - 2020-06-19T08:01:18+05:30 IST
తప్పిపోయి వచ్చిన బాలుడిని అక్రమంగా దత్తత తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదైంది. పటాన్చెరు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..
![అక్రమంగా బాలుడి దత్తత..తీసుకున్న వారిపై కేసు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాయదుర్గం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తప్పిపోయి వచ్చిన బాలుడిని అక్రమంగా దత్తత తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదైంది. పటాన్చెరు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ ఇనార్బిట్మాల్ వద్ద గత ఏడాది వినాయకచవితి రోజున ఆరోను అనే వ్యక్తి పాత దుస్తులు విక్రయిస్తున్నాడు. రెండేళ్ల బాలుడు వర్షంలో తడుస్తూ అతడి వద్దకు వెళ్లాడు. ఆరోను బాలుడిని తీసుకొని పటాన్చెరులో ఉంటున్న పిల్లలు లేని తన మామ యాకోబు, సరోజకు అప్పగించాడు. వారు బాలుడిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్వెల్ఫేర్ అధికారులు బాలుడిని అక్రమంగా దత్తత తీసుకున్న వారిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని సంగారెడ్డిలోని శిశువిహార్కు తరలించారు. బాలుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే 7901148909 ఫోన్ నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.