భగాయత్ బస్తీ..కల్తీతో సుస్తీ
ABN , First Publish Date - 2020-03-02T09:21:04+05:30 IST
ప్రభుత్వ విభాగాల అధికారుల నిర్లక్ష్యం, పట్టింపు లేని ధోరణి, సమన్వయ లోపం, సిబ్బంది చేతివాటం వెరసి రామంతాపూర్ భగాయత్ బస్తీల్లో అనుమతి లేని అక్రమ వ్యాపారాలు మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి.

నాసిరకం సరుకులతో ఆహార పదార్థాల తయారీ
అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
రామంతాపూర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విభాగాల అధికారుల నిర్లక్ష్యం, పట్టింపు లేని ధోరణి, సమన్వయ లోపం, సిబ్బంది చేతివాటం వెరసి రామంతాపూర్ భగాయత్ బస్తీల్లో అనుమతి లేని అక్రమ వ్యాపారాలు మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి.
రామంతాపూర్ భగాయత్ బస్తీలైన కేసీఆర్నగర్, కేటీఆర్నగర్, సాయికృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. జనావాసాల మధ్య వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్, అగ్నిమాపక, వాణిజ్య పన్నుల శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపం తమ పాలిట శాపంగా మారిందని వాపోతున్నారు. భగాయత్ బస్తీల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు, బిస్కెట్ కంపెనీలు, బన్నులు, మిక్చర్, కారా బూందీ, అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రాలను ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నా సంబంధిత విభాగాల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
సమాచార హక్కు చట్టం ప్రకారం అధికారుల నుంచి సమాచారం సేకరించగా భగాయత్ బస్తీల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆరు వాటర్ ప్లాంట్లలో బోర్వెల్ నీటిని వాడుతున్నట్లు తెలియడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు ఇటీవల నకిలీ అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి యజమానిని అదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించిన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. బిస్కెట్లు, బన్నులు, మిక్చర్ తదితర ఆహార పదార్థాల తయారీలో నిర్వాహకులు నాసిరకం సరుకులను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అక్రమ వ్యాపారాలను అరికట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. అక్రమ వ్యాపారుల భరతం పట్టేందుకు పోలీసులు భగాయత్ బస్తీల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్డన్ సెర్చ్ నిర్వహించాలి.. విజయ్రెడ్డి, సాయికృష్ణానగర్ కాలనీ
భగాయత్ బస్తీల్లో అసాంఘిక కార్యకలాపాల నివారణకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించాలి. ఆయా విభాగాల అధికారులు అక్రమ వ్యాపారాలను అరికట్టాలి.
అక్రమ వ్యాపార సంస్థలను సీజ్ చేయాలి .. సాయిబాబా, సాయికృష్ణానగర్ కాలనీ అధ్యక్షుడు
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ వ్యాపార సంస్థలను అధికారులు తక్షణమే సీజ్ చేయాలి. వాటిని నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. గౌతమ్కుమార్, తహసీల్దార్, ఉప్పల్
రెవెన్యూ జీహెచ్ఎంసీ, పోలీసు, అగ్నిమాపక, వాణిజ్య పన్నుల శాఖల సమన్వయంతో భగాయత్ బస్తీల్లో తనిఖీలు నిర్వహిస్తాం. అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.