‘బ్యాలెట్‌ బాక్సులొచ్చాయ్‌’

ABN , First Publish Date - 2020-10-07T17:52:40+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం బ్యాలెట్‌ బాక్సులు నగరానికి చేరుకున్నాయి. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన మరునాడే

‘బ్యాలెట్‌ బాక్సులొచ్చాయ్‌’

హైదరాబాద్ నగరానికి చేరుకున్న 5700 బాక్సులు

విక్టరీ ప్లే గ్రౌండ్‌లో భద్రపర్చిన అధికారులు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం బ్యాలెట్‌ బాక్సులు నగరానికి చేరుకున్నాయి. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన మరునాడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మంగళవారం సాయంత్రానికి దాదాపు 5,700 బాక్సులు వచ్చాయని సంస్థ వర్గాలు తెలిపాయి. విశాఖపట్టణం నుంచి 4,750, చిత్తూరు నుంచి 950 బాక్సులను పది లారీల్లో తీసుకువచ్చారు. ఈ బాక్సులను చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో భద్రపర్చారు. నాలుగైదు రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 29 వేల బాక్సులు నగరానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. 


విక్టరీ ప్లే గ్రౌండ్‌లోని భవనంలో స్థలం సరిపోకుంటే హరిహరా కళాభవన్‌లో బ్యాలెట్‌ బాక్సులు ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో నగరంలో 11,500 నుంచి 12 వేల వరకు పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కనీసం 30 వేలకుపైగా బాక్సులు అవసరమని భావిస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల కోసం తరలించిన బాక్సులను తిరిగి తీసుకువస్తున్నారు. 

Updated Date - 2020-10-07T17:52:40+05:30 IST